వరంగల్, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా విషయంలో టీవీ చానళ్లు, పత్రికలు ప్రజలను భయపెట్టి చంపుతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తంచేశారు. టీవీలు, పత్రికలకు సామాజిక బాధ్యత ఉండాలన్నారు. ‘ఒకడు బ్లాక్ ఫంగస్ అని.. ఇంకోడు ఎల్లో ఫంగస్ అని.. ఇంకోడు వైట్ ఫంగస్ అని చెప్పి చావగొడతరు. ఫంగస్ ఉన్నదో సచ్చిందో కానీ.. సదివి జనం చస్తాండ్రు. మనుషుల సుపీరియర్ థింకింగ్ను ఇన్ఫీరియర్ చేస్తే కలిగే నష్టాల మీద ఒకాయన పెద్ద బుక్కే రాస్తే నేను చదివిన. దాంట్లో ఓ రాజుగారి కథ రాసిండు. ఓ రాజ్యంలో ఎనకట గత్తర్ వచ్చి అనేకమంది చచ్చిపోతాండ్రు. ఆ రాజు వైద్యులు ప్రజలను కాపాడుకోవడానికి తిప్పలు పడ్డరు. కానీ సంజయితలేదు. మరి ఎట్లా? గక్కడ దానికి వ్యతిరేకమైన మాంత్రికుడొకడున్నడు సర్.. వాణ్ణి తీసుకొస్తే తరిమేస్తడు సర్.. అని రాజుకు చెప్పిన్రు. వాణ్ణి బతిమాలి బామాలి తోలుకొచ్చిన్రు.. వాడు ఆ రాజ్యం పొలిమేర దాటి వస్తాండు. వీడు వస్తున్నడంటేనే మహమ్మారికి భయం. వీడు ఎంటరయితున్నడు.. అది బయటకు పోతున్నది. ఇద్దరూ ఎదురుపడిన్రు. వీడు.. ‘అనవసరంగా ఐదు వందల మందిని చంపితివి గదే నీ పాడుగాను..’ అన్నడు. అంటే ఆ మహమ్మారి.. ‘అన్నానేను చంపింది యాభై మందినే. 450 మంది దగడుకే చచ్చిపోయిండ్రు’ అని చెప్పిందట. ఇంత దుష్ప్రచారం చేయడం ఈ టీవీల వాళ్లకు అవసరమా? దాంతో ఏం సాధిస్తరు వీళ్లు? మనకు సమాజం పట్ల బాధ్యత ఉండాలె. ఇప్పుడు చిన్న పొల్లగాళ్లకు వస్తదంటున్నరు. వాళ్లు పంటలేరు. ముందే బడి బందై పిచ్చి పిచ్చి చేస్తన్నరు ఇండ్లపంటి. బడికి పోయొచ్చిండంటే వాడికి దోస్తుంటడు, టీచర్ ఉంటడు.. క్లాసులుంటయి.. ఆడుకుంటడు.. పొద్దు గడుస్తది. మొత్తానికే బందైతే వాళ్లకు ఏంచేయాల్నో అర్థంకాదు. ఇల్లంత అంగడంగడి చేస్తాన్రు. గిట్ల ఉన్నది కథ. ఇప్పుడు వాళ్లకొస్తదని పెట్టిన్రు. నీకు ఫోన్చేసి చెప్పినాది.. ఈ తాప వచ్చి నేను పిల్లలకు పడతానని? ఎవరు చెప్పిన్రు నాకర్థం కాదు. ఇది మంచిది కాదు. ఇలాంటి విషయాల్లో టీవీల తీరు మారాలి. ఇటీవల చీఫ్ జస్టిస్ రమణను కలిసిన. కరోనా గురించి మాట్లాడుతుంటే ఆయన చెప్పిండు. వాళ్లకు తెలిసిన పిలగానికి కరోనా వచ్చిందని హాస్పిటల్లో చేరిండట. ఏవేవో చెప్పి స్టెరాయిడ్లు ఇచ్చిండ్లట. ఆ పిలగాడు ఇంతదొడ్డు అయిండట. ఎందుకు ఇట్ల చేసుడు? నాకు కరోనా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లిన. జరం తగ్గించడానికి డోలో గోలి, ఒంటికి పడే యాంటిబయాటిక్ గోలి వేసుకోమన్నడు. వారానికోటి డీ విటమిన్ గోలి అని చెప్పిండ్లు. వారంలనే నాకు తగ్గవైంది. దీనికి గన్ని కతలు, భయోత్పాతాలు. ఎవరి ఉపయోగం కోసం టీవీలు ఇట్ల చేసుడు? ప్రజల బతుకులతో ఆడుకునేందుకు సంచలనాలు వద్దు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పాలి. టీవీలలో చూసి జనం బెదిరిపోవుడు ఏంది? ఇప్పటికైనా మారాలి.
సుబేదారి అని ఎందుకు వచ్చిందటే..
నిజాం హయాంలో వరంగల్ ప్రాంతాలో దట్టమైన అటవీ సంపద ఉండేది. నిజాం ప్రభువులు ఇక్కడికి వేట కోసం వచ్చేవాళ్లు. భువనగిరిలో విశాలమైన గెస్ట్హౌజ్ ఉంటుంది. దాన్ని డాక్ బంగ్లా అంటరు. గుర్రపు బగ్గీలు అక్కడ ఆగేవి. నిజాం పటాలం విడిది కోసం భువనగిరిలో ఏర్పాటు చేశారు. అలాగే వరంగల్కు వచ్చేవాళ్లు. వేట కోసం వచ్చి ఇక్కడ ఉండేందుకు హిబానా షాషీ పేరుతో నివాసం ఏర్పాటు చేశారు. నిజాం హయాంలో ఇక్కడి ప్రాంతం సుభాగా ఉండేది. అందుకే ఈ ప్రాంతానికి సుబేదారి అనే పేరు వచ్చింది. అదే ఇప్పటి కలెక్టర్ క్యాంపు కార్యాలయం భవనం.
కలెక్టర్ పదం మారాలి..
కలెక్టర్ పేరు కూడా మార్చాలి. ఎందుకంటే కలెక్టర్ అంటే కలెక్ట్ చేసేవాడు. ఆ రోజుల్లో రెవెన్యూ (భూమిశిస్తు) వసూలు చేసే బాధ్యత కలెక్టర్పై ఉండేది. ఆ భూమిశిస్తు ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. భూమిశిస్తును అనుసరించే.. గ్రామంలో కూడా పటేల్, పట్వారీ వ్యవస్థ వచ్చింది. అది పరమ దుర్మార్గమైన వ్యవస్థ అని దాన్ని తీసేసిన్రు. తర్వాత వీఆర్వోలు వచ్చిన్రు. వాళ్లు ఎట్లా ఉండేవారో నేను చెప్పక్కర్లేదు. వాళ్లను కూడా ఈ మధ్య తీసేసినం. ధరణి పోర్టల్ కూడా వచ్చింది. ధరణి బాగనే ఉన్నదా? అది అట్లనే ఉండాల్నా? బంజేద్దామా? ముందుముందు ఇంకా చాలా జరగాల్సి ఉన్నది. అట్ల జరిగినప్పుడు మధ్యన ఈ తాబేదార్లు, పైరవీకార్లు ఉండరు. ప్రజలకు పారదర్శకంగా పరిపాలన అందుతది.