సియోల్, ఏప్రిల్ 28: సామ్సంగ్ వ్యవస్థాపక కుటుంబం భారీ ఎత్తున వారసత్వ పన్నును చెల్లించనున్నది. దక్షిణ కొరియా ప్రభుత్వానికి మునుపెన్నడూ లేనివిధంగా ఏకంగా 10.8 బిలియన్ డాలర్లు (రూ.80,450 కోట్లు) అప్పగించనున్నది. గతేడాది కొరియా మొత్తం ఎస్టేట్ ట్యాక్స్ రెవిన్యూ కంటే ఇది మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. ఈ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ చైర్మన్ లీ కున్-హీ గతేడాది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్తుల పంపకాల మధ్య ఈ వారసత్వ పన్ను తెరపైకి వచ్చింది. కాగా, రాబోయే ఐదేండ్లలో 6 విడుతలుగా ఈ పన్నును లీ భార్య, ముగ్గురు సంతానం చెల్లించనున్నారు. తొలి విడుత ఈ నెలలోనే జరుగనుండగా, పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎంతో విలువైన వేలాది పెయింటింగ్స్ను లీ కుటుంబం విరాళంగా ఇస్తున్నది. అలాగే 900 మిలియన్ డాలర్లను క్యాన్సర్ ఇతర అరుదైన వ్యాధులపై పరిశోధనకుగాను ఇస్తున్నారు. లీ ఏకైక కుమారుడు ప్రస్తుతం జైలులో ఉన్నారు.