కోరుట్ల, జూన్ 10: ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధించి ఈ ఘనత సాధించిందన్నారు. భవిష్యత్తుతరాలకు ఉపాధి కల్పించేలా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సంజయ్కుమార్, కలెక్టర్ రవి గుగులోత్తో కలిసి వ్యవసాయ విధానం, అనుసరించాల్సిన పద్ధతులు, ఇతర అంశాలపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఒకే రకమైన పంట సాగు విధానానికి మొగ్గు చూపకుండా వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.