కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మెప్పును పొందారు నటుడు సోనూసుద్. ఆశ్రితులకు సొంత డబ్బులతో సహాయాన్ని అందించి సహృదయతను చాటుకున్నారు. ఇటీవల ఆయన నివాసాలతో పాటు కార్యాలయాలపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. సోనూ సూద్ ఇరవై కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఐటీ శాఖ ఆరోపిస్తున్నది. అలాగే తన సేవా సంస్థ పేరుతో పంతొమ్మిది కోట్ల మేర విరాళాల్ని సేకరించిన ఆయన అందులో 1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాల కోసం ఉపయోగించారని, మిగతా డబ్బును నకిలీ సంస్థలకు మళ్లించారని ఐటీ అధికారులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై తొలిసారి సోనూ సూద్ స్పందించారు. మనవైపు కథను ప్రతిసారి మనమే చెప్పాల్సిన అవసరం లేదు.. కాలమే కొన్నిసార్లు సమాధానం చెబుతుందని అన్నారు. సోనూ సూద్ మాట్లాడుతూ ‘నా శక్తియుక్తులను ధారపోస్తూ మంచి మనసుతో దేశప్రజలందరికీ సేవ చేస్తానని స్వీయ ప్రతిజ్ఞ చేసుకున్నా. విలువైన ప్రాణాలను కాపాడటంతో పాటు సహాయం కోసం ఎదురుచూసే ప్రజల కోసం నా ఫౌండేషన్లోని ప్రతి రూపాయిని ఖర్చుచేస్తా. బ్రాండ్స్కు నేను ప్రచారకర్తగా వ్యవహరించినందుకు వచ్చే పారితోషికాల్ని సమాజసేవ కోసమే వినియోగిస్తా. భవిష్యత్తులో ఇదే మార్గాన్ని అనుసరిస్తా. కొద్ది మంది అతిథులను కలుసుకోవాల్సి రావడంతో గత నాలుగు రోజులుగా సేవా కార్యక్రమాల్ని కొనసాగించలేకపోయాను. అందరికి సేవ చేస్తూ నా ప్రయాణాన్ని కొనసాగించడానికి మళ్లీ ముందుకొచ్చా’ అని తెలిపారు.