వర్ధన్నపేట, మే 11: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలను కేటాయించిన మిల్లులకు వెంటవెంటనే తరలించాలని వరంగల్ జేడీఏ ఉషాదయాళ్ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని కట్య్రాల, ఇల్లంద, వర్ధన్నపేట, కొత్తపల్లి, ల్యాబర్తి, ఉప్పరపల్లి, నల్లబెల్లిలోని కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు ధాన్యం తీసుకురాగానే నిర్వాహకులు తేమశాతం 17లోపు ఉండేలా చూస్తూ కాంటాలు వేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆమె వెంట ఏవో రాంనర్సయ్య ఉన్నారు.
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
చెన్నారావుపేట: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ భూక్యా హరిసింగ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, జల్లి గ్రామంలోని పారాబాయిల్డ్ రైస్ మిల్లును ఆయన పరిశీలించారు. రైతుల నుంచి వరుస క్రమంగా ధాన్యం కొనాలన్నారు. తూకంలో తేడా వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ పూల్సింగ్చౌహాన్, గిర్దావర్స్వామి, వీఆర్వో ఐలయ్య, బొబ్బాల రమేశ్ ఉన్నారు.
కొనుగోళ్లను వేగవంతం చేయాలి
ఖానాపురం: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. మండలంలో 17 కేంద్రాల ద్వారా 60 వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఓడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 90 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట వైస్ చైర్మన్ వేణుకృష్ణ, రైతుబంధు తుంగబంధం కన్వీనర్ వేజళ్ల కిషన్రావు, సొసైటీ సీఈవో ఆంజనేయులు ఉన్నారు.
నర్సంపేట రూరల్/గీసుగొండ: లక్నేపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ఏవో కృష్ణకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో లక్నేపల్లి, రామవరం సర్పంచ్లు గొడిశాల రాంబాబు, కొడారి రవన్న, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, ఏఈవోలు మెండు అశోక్, భరత్, నవీన్, నాయకులు శ్యాంసుందర్, భిక్షపతి, రమేశ్, రవి, సంతోశ్, నరేందర్, కుమారస్వామి, ప్రకాశ్, భాస్కర్, నర్సయ్య, మధు, విష్ణు, సాంబయ్య పాల్గొన్నారు. గీసుగొండ మండలంలోని వంచనగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ పోలీసు ధర్మారావు ప్రారంభించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ వీరగోని రాజ్కుమార్, సొసైటీ చైర్మన్ రవీందర్, నాయకుడు కొండా వెంకన్న పాల్గొన్నారు.
అందుబాటులో గన్నీ బ్యాగులు
దామెర: రైతులకు అందుబాటులో గన్నీ బ్యాగులు ఉన్నాయని తహసీల్దార్ రియాజొద్దీన్ అన్నారు. ఊరుగొండలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కాంటాలు, రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట వీఆర్వో బాబు, సూపర్వైజర్ కిరణ్ ఉన్నారు.