సుధీర్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. కరుణకుమార్ (‘పలాస 1978’ ఫేమ్) దర్శకుడు. విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్ను గురువారం అగ్రహీరో మహేష్బాబు విడుదల చేశారు. కథానాయకుడు సూరిబాబుని జైలుకి తరలిస్తున్న సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. ‘జైలుకొచ్చిన మనిషి, జైలు నుంచి బయటకు వెళ్లిన మనిషి ఎప్పటికీ ఒక్కటి కాదు’.. ‘మంచోడే..కానీ మనోడు కాదు’ అనే సంభాషణలు ఆకట్టుకునేలా అనిపించాయి. చివరగా ‘నా శ్రీదేవికి పెళ్లి చేసేస్తార్రా..’ అంటూ సూరిబాబు కోపోద్రిక్తుడై కనిపించే సన్నివేశంతో ట్రైలర్ ఎమోషనల్గా ముగిసింది.
ఓ గ్రామంలో లైటింగ్ పనులు చేసే సూరిబాబు, సోడాసెంటర్ నిర్వహించే శ్రీదేవి జంట ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. కులాల అంతరాల్ని, సామాజిక వివక్షను చర్చిస్తూ ఈ చిత్ర ఇతివృత్తం సాగుతుందని చెబుతున్నారు. ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తోందని, ఈ నెల 27న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఆనంది, పవెల్ నవగీతమ్, నరేష్, రఘుబాబు, అజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్దత్ సైనుద్దీన్, ఎడిటర్:శ్రీకర్ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కథ: నాగేంద్ర కాషా, నిర్మాణ సంస్థ: 70ఎం.ఎం.ఎంటర్టైన్న్మెంట్స్, రచన-దర్శకత్వం: కరుణకుమార్.