‘ఆచార్య’ సినిమా గురించి మెగాభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్చరణ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. సెకండ్వేవ్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ కొద్దిరోజుల క్రితం పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారాన్ని నిర్మాణ సంస్థ బుధవారం వెల్లడించింది. టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని, రెండు పాటలు మాత్రమే బ్యాలన్స్గా ఉన్నాయని తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘టాకీ పార్ట్ను అనుకున్న విధంగా జూలై 31నాటికే పూర్తిచేశాం. ఈ నెల 20 నుంచి చిరంజీవి, రామ్చరణ్లపై ఓ పాటను…చరణ్, పూజాహెగ్డేలపై మరో గీతాన్ని చిత్రీకరిస్తాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో చిరంజీవి ఆచార్యుడిగా, నక్సలైట్గా భిన్న కోణాల్లో సాగే పాత్రను పోషిస్తున్నారని చెబుతున్నారు. రామ్చరణ్ సిద్ధ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. బలమైన సామాజికాంశాన్ని చర్చిస్తూ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణ్ణావుక్కరసు, సంగీతం: మణిశర్మ, నిర్మాణ సంస్థలు: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, రచన-దర్శకత్వం: కొరటాల శివ.