1956 పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం.. తెలంగాణలోని ప్రతి మండలానికీ ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి. అయినా,
3 లక్షల జనాభా గల నాగార్జునసాగర్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీఏర్పాటును ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకున్న నాథుడు లేడు. ఇక్కడి నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా ్రప్రాతినిధ్యం వహించి, 17 ఏండ్లు మంత్రిగా ఉన్న జానారెడ్డికివిద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు వినతి పత్రాలు ఇవ్వని ఏడాది లేదు. ధర్నాలు చెయ్యని విద్యా సంవత్సరం లేదు. అయినా ఫలితం లేకపోవంతో ఈ ప్రాంత విద్యార్థులు డిగ్రీ చదువాలంటే అటు మిర్యాలగూడకో, ఇటు నల్లగొండకో వెళ్లక తప్పని పరిస్థితి. ఈ సమస్యకారణంగా చాలామంది ఉన్నత విద్యకు దూరమై ఆటో డ్రైవర్లుగా, రోజు కూలీలుగా మారారు.
హాలియా, మార్చి 29 : హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు నాగార్జునసాగర్ నియోజకవర్గ విద్యార్థుల చిరకాల వాంఛ. 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై అప్పటి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కుందూరు జానారెడ్డిని విద్యార్థి సంఘాలు పలుమార్లు విన్నవించాయి. పట్టించుకోకపోవడంతో హాలియా బస్టాండ్ వద్ద నిరాహార దీక్షలు సైతం చేపట్టి నిరసన తెలిపాయి. అయినా పట్టించుకోలేదు. 2018 ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆయన విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ప్రాంత విద్యార్థులు, వారి తల్లిదండ్రుల బాధలు తప్పాయి.
నియోజకవర్గ స్థితిగతులు..
నాగార్జున సాగర్ నియోజకవర్గ జనాభా సుమారు 3లక్షలు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన వారే అధికం. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఏటా 4 నుంచి 5 వేల మంది విద్యార్థులు ఇంటర్ చదువుల కోసం బయటకు వెళ్తున్నారు. నియోజకవర్గంలో హాలియా, నాగార్జున సాగర్ మినహా ఎక్కడా ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు. మండలానికో ప్రభుత్వ జూనియర్ కళాశాల, నియోజకవర్గానికో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాల్సి ఉండగా.. సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి ఇవేమీ పట్టించుకోలేదు. స్థానికంగా ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులు చదువుకుని తమను ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో రెండు దశాబ్దాలుగా వాటి ఏర్పాటుకు పూనుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఏటా సుమారు 3 నుంచి 4 వేల మంది విద్యార్థులు నల్లగొండ, మిర్యాలగూడ, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దూర ప్రాంతాలకు వెళ్లలేక, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకునే స్థోమత లేక ఎంతో మంది పేద విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేశారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పాసైన యవకులు ఆటో డ్రైవర్లుగా, వ్యవసాయ కూలీలుగా మారిన దుస్థితి.
కాలేజీ ఏర్పాటుకు నోముల కృషి
హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సర్కారు అనుమతి ఇవ్వడం వెనుక దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కృషి ఎంతో ఉంది. కాంగ్రెస్ నేత జానారెడ్డి నిర్లక్ష్యంగా వదిలేసిన పనులను పూర్తి చేసి తానేంటో ప్రజలకు తెలియజేస్తానని నోముల తరుచూ చెప్పేవారు. చెప్పినట్లుగానే హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రమైన హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుతో నోముల నర్సింహయ్య జనం హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.
ఇప్పటివరకు ఏటా రూ.20 కోట్లు..
గత కాంగ్రెస్ పాలకులు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలైన డిగ్రీ కళాశాల, ఇంజినీరింగ్, బీ పార్మసీ వంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయకపోవడం వల్ల నియోజకవర్గానికి చెందిన పేద, మధ్యతరగతి ప్రజలపై ఏటా రూ.20 కోట్ల భారం పడుతున్నది. పదో తరగతి పాసైన తరువాత ఒక విద్యార్థి ఇంటర్, ఆపై చదువుల కోసం ఏటా లక్ష నుంచి లక్షా యాబై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సాగర్ నియోజకవర్గంలో ఎక్కడైనా ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలను ఏర్పాటు చేసి ఉంటే పేద, మధ్యతరగతి ప్రజలకు సుమారు రూ.20 కోట్లు మిగిలేవి. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తుండడంతో ఇక పేద, మధ్య తరగతి విద్యార్థులపై భారం తప్పినట్లే.
శుభ పరిణామం
హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం. ఇప్పటి నుంచి పేద, మధ్య తరగతి విద్యార్థులు, ఇక్కడే ఉచితంగా చదువుకునే అవకాశం లభిస్తుంది. వారికి ఆర్థిక భారం తప్పనుంది.
కేసీఆర్ సారును జీవితాంతం గుర్తుపెట్టుకుంటా..
హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయడం ఆనందంగా ఉంది. కాలేజీ ఏర్పాటుతో ఇక్కడే ఉండి చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. 50 నుంచి 150 కిలోమీటర్లు పోవాల్సి వచ్చేది. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనుమతిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ను పేద విద్యార్థులు జీవిత కాలం గుర్తుంచుకుంటారు.
నాడు పోరాడినా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు
నేను హాలియాలో చదువుకునేటప్పుడు నాతోటి పేద విద్యార్థుల కష్టాలను చూసి హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గత కాంగ్రెస్ పాలకులకు ఎన్నో సార్లు వినతిపత్రాలు ఇచ్చాను. కానీ ఏనాడూ స్పందించలేదు. చివరకు అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టినా పట్టించుకోలేదు. నర్సింహయ్య కృషితో టీఆర్ఎస్ సర్కారు హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయడం హర్షణీయం.
దూర ప్రాంతాలకు పంపే బాధ తప్పుతుంది
హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల తమ పిల్లలను దూర ప్రాంతాలకు పంపాల్సి వస్తుంది. దీంతో పిల్లలు ఎలా ఉంటారోనని భయమేస్తుంది. అధిక ఖర్చులు అవుతున్నాయి. హాలియాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే మా పిల్లలను ఇతర పట్టణాలకు పంపాల్సిన అవసరం ఉండదు. దీంతోపాటు ఖర్చులూ తప్పుతాయి. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
ఇవీ కూడా చదవండి..
స్లో ఓవర్రేట్.. టీమ్ఇండియాకు భారీ జరిమానా