జనగామ-చేర్యాల రోడ్డునుబాగు చేయాలి
ముస్త్యాల-మద్దూరు రోడ్డుకు నిధులివ్వాలి
అసెంబ్లీలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విజ్ఞప్తి
చేర్యాల, మార్చి 20 : జనగామ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా మారి అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఉందని, సంబంధిత శాఖ ఆధ్వర్యంలో వెంటనే మరమ్మతులు చేయడంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అసెంబ్లీలో శనివారం ప్రభుత్వాన్ని కోరారు. జీరో అవర్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్, వరంగల్ మధ్యలో ఉన్న జనగామ నియోజకవర్గ ప్రధాన రహదారి పనులు జరగడంలేదని, కొంత మేరకు పనులు చేశారని, వాటిలో నాణ్యతాప్రమాణాలు పాటించలేదన్నారు. వెంటనే నాణ్యతాప్రమాణాలతో రోడ్డును నిర్మించాలని కోరారు. జనగామ-చేర్యాల ప్రధాన రోడ్డును మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామం మీదుగా మద్దూరు మండల కేంద్రం నుంచి జనగామ నియోజకవర్గంలోని నర్మెట మండల కేంద్రానికి వెళ్లే రహదారి పనులు పూర్తి చేయాలని, కావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరారు. రోడ్లు సక్రమంగా లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి లేవనెత్తిన సమస్యలను నమోదు చేసుకున్నానని, సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.