ఇబ్రహీంపట్నం, జూలై 13 : ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఏరియా దవాఖాన అభివృద్ధిలో భాగంగా రూ.కోటిన్నరతో నూతన భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు. మంగళవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దవాఖాన స్థాయిని పెంచేందుకు దోహదపడే విధంగా అధునాతన భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దవాఖాన వెనుకాల రూ.10లక్షలతో కొత్త పోస్టుమార్టం గదులను నిర్మించడానికి నిధులిస్తామని తెలిపారు. దవాఖాన ఆవరణలో శిథిలాలను వెంటనే తొలగించాలని మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, కమిషనర్ జయంత్కుమార్రెడ్డిని ఎమ్మెల్యే ఆదేశించారు. వ్యాక్సినేషన్ కేంద్రం ఎదుట క్యూ లైను షెడ్డును నిర్మించనున్నట్లు చెప్పారు. మెటర్నిటీ వార్డులో అధునాతన మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మందులు అందుబాటులో ఉంచాలి..
భవనాలకు రంగులువేసి, ఆవరణలో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా సహాయ వైద్యాధికారి నాగజ్యోతిని ఎమ్మెల్యే ఆదేశించారు. మందులు ప్రజలకు అందుబాటులో ఉంచి సేవలందించాలని సూచించారు. ముఖ్యంగా ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి టీకా వేసే విధంగా వైద్యారోగ్యశాఖాధికారులు కృషిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో ఎంపీపీలు కృపేశ్, నర్మద, సహకార సంఘం మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, వైద్యాధికారులు సుధాకర్, రాహుల్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, దవాఖాన సలహా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ను సద్వినియోగం చేసుకోవాలి
ఇబ్రహీంపట్నం రూరల్, జూలై 13 : పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి సీఎం సహాయనిధి ద్వారా ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్కు చెందిన కాకి సత్యనారాయణకు మంజూరైన రూ.2.50లక్షల సీఎం సహాయనిధి చెక్కును కుటుంబసభ్యులకు మంగళవారం ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, నాయకులు రవీందర్, సాయికిశోర్ పాల్గొన్నారు.