భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 2019 సంవత్సరానికి గాను రజనీకాంత్ 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకోనున్నారు. తలైవా దాదాసాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపికవ్వడంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు . పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ద్వారా రజనీకాంత్కు శుభాకాంక్షలు తెలియజేశారు. వైవిధ్యమైన పాత్రలతో తరతరాలుగా ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న తలైవాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించడం సంతోషంగా ఉంది. మీకు నా అభినందలు అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మక అవార్డ్ గెలుచుకున్న రజనీకి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, దక్షిణాదికి చెందిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు), ఎల్వీ ప్రసాద్ (తెలుగు), నాగిరెడ్డి(తెలుగు), అక్కినేని నాగేశ్వరరావు(తెలుగు), శివాజీ గణేషన్(తమిళం), రాజ్కుమార్(కన్నడ), గోపాలకృష్ణన్(మలయాళం), రామానాయుడు(తెలుగు), బాలచందర్(తెలుగు, తమిళం), కె. విశ్వనాథ్(తెలుగు) ఈ పురస్కారాన్ని అందుకున్నవారిలో ఉన్నారు.