న్యూఢిల్లీ, మే 9: కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్లు గాలిలో కొంత కాలం పాటు ఉంటాయని, వాటిని పీల్చడం వల్లే ఇతరులకు వైరస్ వ్యాపిస్తుందని, కరోనా వైరస్ సోకే విధానాల్లో ఇది అత్యంత ప్రధానమైనదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) వెల్లడించింది. అందుకే తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది. కరోనా సోకిన వ్యక్తి నుంచి ఆరు అడుగుల దూరం వరకు గాలిలో వైరస్ ఉనికి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. వెంటిలేషన్ లేనిచోట ఇంకా ఎక్కువ దూరం వ్యాపిస్తుందని పేర్కొన్నది. రోగి తుంపర్లలోని వైరస్ గాలిలో ఎంతసేపు క్రియాశీలకంగా ఉంటుందనే విషయం అక్కడి తేమ, ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నది.