మాయదారి కరోనా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నది. వైరస్ బారిన పడి, దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారి పిల్లలను కొందరు బంధువులు కూడా దగ్గరకు రానీయని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్నమైన ఆలోచన చేసి ఇలాంటి పిల్లల సంరక్షణ బాధ్యతలను స్వీకరిస్తున్నది. ట్రాన్సిట్ హోమ్స్ పేరిట సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు కోలుకుని ఇంటికి తిరిగి వచ్చే వరకు పిల్లలను ఈ కేంద్రాల్లో సంరక్షించనున్నది. కొవిడ్ బారినపడి తల్లి దండ్రులను కోల్పోయిన వారి పిల్లలకు కూడా ఆశ్రయం కల్పించనున్నది. ఈ కేంద్రాల్లో మంచి బలవర్ధకమైన ఆహారంతోపాటు ఆన్లైన్ క్లాసులు, ఆటాపాటల ద్వారా పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని కలిగించనున్నది. ఇలాంటి బాలలు ఉంటే సమాచారం ఇచ్చేందుకు 040-23733665 నంబర్ను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా 1098, 100 నంబర్లను కూడా 24 గంటలపాటు అందుబాటులో ఉంచుతున్నది.
-కరీంనగర్, మే 21(నమస్తే తెలంగాణ)
కరోనా బారిన పడిన వారి పిల్లల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ట్రాన్సిట్ హోమ్స్ ఏర్పాటు చేస్తున్నది. వైరస్ బారినపడిన తల్లిదండ్రులు దవాఖానాల్లో చికిత్స పొందుతుండగా ఇంటిలో పిల్లలను ఆదరించే వారు కరువవుతున్నారు. బంధువులు ఉన్నా కొందరిలో కరోనా భయం వెంటాడుతున్నది. ఈ కారణంగా అనేక చోట్ల పిల్లలు ఒంటరిగా ఉండాల్సి వస్తున్నది. నిరుపేద కుటుంబాల పిల్లలనైతే ఆదరించే వారు లేకుండా పోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధి, శిశు, వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ట్రాన్సిట్ హోమ్స్ ఏర్పాటు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆరు ఏర్పాటు చేయగా, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బాలసదన్లో బాలికలకు, వెంకట్ ఫౌండేషన్లో బాలుర కోసం రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లాలో కలెక్టర్ రవి ఆదేశాల మేరకు రెండు ట్రాన్సిట్ హోమ్స్ (బాలసదనాలు) ఏర్పాటు చేశారు. బాలుర, బాలికలకు వేర్వేరుగా కేరింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పాత బస్టాండ్ సమీపంలోని ఆనంద్ భవన్లో బాలికలకు, పోలీసు క్యాంపు కార్యాలయం సమీపంలోని బాలుర ఎస్సీ హాస్టల్లో బాలురకు వసతి కల్పించడానికి బెడ్లు సిద్ధం చేశారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో రామగుండంలోని తబితా ఆశ్రమంలో బాలల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల-వేములవాడ రహదారిలో ఆగ్రహారం వద్ద గల బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మగ పిల్లలకు, ఆడ పిల్లలకు వేర్వేరు గదుల్లో పది బెడ్లను సమకూర్చారు. మొత్తం లక్షతో మౌలిక వసతులు కల్పించారు. ఈ కేంద్రం అంతా సీసీ టీవీల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వీటితోపాటు కరీంనగర్ బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని ఆనంద భవన్లో బాలుర కోసం మరో ట్రాన్సిట్ హోమ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం, ఎన్జీవోల భాగస్వామ్యంతో ఈ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. కరోనా మహమ్మారి మరింత చెలరేగితే రాబోయే రోజుల్లో ఈ కేంద్రాలు పిల్లల సంరక్షణకు తోడ్పాటును అందించనున్నాయి.
ఇప్పటికే పలువురికి ఆసరా
కరోనా బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారి పిల్లలను సంరక్షించేందుకు ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోమ్స్లో వసతి పొందడమే కాకుండా పిల్లలకు 2 వేల విలువైన బియ్యం, పప్పులు, నూనెలు ఇతర నిత్యావసర వస్తువులను కూడా నేరుగా ఇంటికే పంపిస్తున్నారు. ఈ విధంగా కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది మందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో తొమ్మిది మంది చిన్నారులకు సేవలందిస్తున్నారు. ట్రాన్సిట్ హోమ్స్కు పిల్లలను పంపించేందుకు ముందుకు రాని పక్షంలో నిత్యవసరాలు కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో తల్లితండ్రులు కోల్పోయిన బాలుడికి మూడు నెలలకు సరిపడా 6 వేల విలువైన నిత్యావసర వస్తువులు అందించారు.
మంచి వాతావరణంలో సంరక్షణ..
కరోనా బారిన పడి దవాఖానాల్లో చికిత్స పొందుతున్న వారి పిల్లలను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పూర్తి సురక్షితమైన భవనంలో వీరికి ఆశ్రయం కల్పిస్తున్నది. అంతేకాకుండా ప్రతి రోజూ ఉదయం పాలు, టీ, కాఫీ, టిఫిన్స్ మధ్యాహ్నం రెండు మూడు కూరలతో భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్లో రెండు మూడు కూరలు ఉండే విధంగా మెనూ సిద్ధం చేశారు. తల్లిదండ్రులపై బెంగ పెట్టుకోకుండా మానసిక నిపుణులతో ధైర్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆటా, పాటలతో మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేందుకు రిక్రియేషన్ ఆక్టివిటీస్ చేపడుతున్నారు. ఆయా తరగతులకు అనుగుణంగా ఆన్లైన్ క్లాసులు ఇప్పించే ఏర్పాట్లు చేశారు. వర్చువల్ పద్ధతిలో పిల్లలు తమ తల్లిదండ్రులతో మాట్లాడుకునే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా పిల్లలకు అనువైన లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. తల్లిదండ్రులు కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలను తిరిగి వారికి అప్పగించే వరకు కంటికి రెప్పలా కాపాడుతామని జిల్లా సంక్షేమ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సమాచారం కోసం టోల్ ఫ్రీ..
కరోనా బారిన పడిన తల్లిదండ్రుల పిల్లలను ట్రాన్సిట్ హోమ్స్కు తరలించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 040-23733665కు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమాచారం అందించవచ్చు. అలాగే, చైల్డ్ హెల్ప్ నంబర్ 1098కు లేదంటే పోలీసు నంబర్ డయల్ 100కు సమాచారం ఇచ్చినా పిల్లలను ట్రాన్సిట్ హోమ్స్కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తారు. ఇందు కోసం వాహనాలను సమకూర్చారు. సంబంధిత అధికారులు ఈ విషయంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫోన్ చేస్తే చాలు సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి పిల్లలను కేంద్రాలకు వాహనంలో తీసుకెళ్తారు. ఒకవేళ పిల్లలు కొవిడ్ బారిన పడి పరిస్థితి సీరియస్గా ఉంటే దవాఖానలకు తరలించి మెరుగైన వైద్యం అందేలా చూస్తారు. కరీంనగర్ కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ట్రాన్సిట్ హోమ్స్కు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ వైద్యాధికారులకే కాకుండా ఐఎంఏ ద్వారా ప్రైవేట్ వైద్యులకు సమాచారం అందిస్తున్నారు. ఆయా దవాఖానల్లో చికిత్స పొందుతున్న తల్లిదండ్రులకు వారి పిల్లలను ట్రాన్సిట్ హోమ్స్కు పంపించాలని సూచించేలా వారికి వివరిస్తున్నారు. ఇటు సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లలో జూమ్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు.
చిన్నారులకు సర్కారు అండ
బాలల పరిరక్షణకు సర్కారు ప్రత్యేక చొరవ చూపుతున్నది. తల్లిదండ్రులు కరోనా బారిన పడితే వారి పిల్లలను పట్టించుకునే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని పేదలు గుడిసెల్లో ఉంటారు. వారి పిల్లల బాధ్యతను బాలల పరిరక్షణ సంస్థ చూసుకుంటుంది. అందు కోసం అగ్రహరంలో ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఇక్కడ పది బెడ్లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి బెడ్ల సంఖ్యను పెంచుతాం. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మూడు కాల్స్ వచ్చాయి. ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలి.
-రామగిరి స్వర్ణలత, బాలల పరిరక్షణ సంస్థ జిల్లా అధికారి
(రాజన్న సిరిసిల్ల)
విస్తృతప్రచారం చేస్తున్నాం..
ట్రాన్సిట్ హోమ్స్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. కరోనా సోకిన ఇళ్లలో ఎవరైనా ఇబ్బంది పడే పిల్లలు ఉంటే మాకు వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామాలు, పట్టణాల్లో చెబుతున్నాం. ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా జూమ్ మీటింగ్స్ నిర్వహిస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాల్లో సంబంధిత పోస్టర్లను ప్రదర్శిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో రెండు ట్రాన్సిట్ హోమ్స్ ఏర్పాటు చేశాం. మరొకదాని కోసం కలెక్టర్కు ప్రతిపాదన పంపించాం. కరోనా ఉధృతమైతే అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం. కరోనా బారిన పడిన తల్లిదండ్రులు చికిత్స కోసం దవాఖానలకు వెళ్తే మీ పిల్లలను మాకు అప్పగించి వెళ్లాలి. వాళ్లని కంటికి రెప్పలా చూసుకుంటాం.
కరోనా వేళ జిల్లాలో బాల, బాలికలకు ఇబ్బందులు కలుగకుండా బాలల సంరక్షణ కేంద్రాన్ని రామగుండం నియోజకవర్గంలోని తబితా ఆశ్రమంలో ఏర్పాటు చేశాం. ఎలాంటి అవసరాలున్నా మాకు తెలియజేయాలి. పేదరికంతో ఉండి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న 18 ఏండ్లలోపు చిన్నారులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుంది. కరోనా సమయంలో తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు కొవిడ్కు గురైతే పిల్లలను ఆదుకునేందుకే ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
-లక్ష్మీరాజం, పెద్దపల్లి జిల్లా సంక్షేమ శాఖ అధికారి
సమాచారం అందిస్తే తక్షణ చర్యలు..
తల్లిదండ్రులు కరోనా బారిన పడి పిల్లలు నిరాశ్రయులైనట్లు సమాచారమందిస్తే వెంటనే చర్యలు చేపడతాం. కొవిడ్ వచ్చిన తల్లిదండ్రుల పిల్లల సంరక్షణకు ట్రాన్సిట్ కేరింగ్ హోమ్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాధితుల ఇంటికి వెళ్లి విచారించి పిల్లలకు కరోనా పరీక్షలు చేయిస్తాం. వైరస్ లేకుంటే వారిని జగిత్యాలలోని హోమ్కేరింగ్ సెంటర్లకు తరలించి సౌకర్యాలు కల్పిస్తాం. ఒకవేళ కరోనాతో తల్లిదండ్రులు మృతి చెంది వారి పిల్లలు అనాథలుగా మారినట్లయితే వారి రక్షణ, ఆలనా పాలనా ప్రభుత్వం చూసుకుంటుంది.