‘శీను’ ‘రోజాపూలు’ ‘బిచ్చగాడు’ వంటి చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు తమిళ డైరెక్టర్ శశి. ఆయన నిర్దేశకత్వంలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’. నిర్మాత ఏఎన్ బాలాజీ ఈ నెల 13న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం దర్శకుడు శశి పాత్రికేయులతో మాట్లాడుతూ ‘నా కథలో మానవోద్వేగాలకు పెద్దపీట వేస్తాను. ‘ఒరేయ్ బామ్మర్ది’ చిత్రంలో బావ, బావమరిది మధ్య ఉండే అనుబంధాన్ని చూపించబోతున్నా. ఇరవై ఏళ్ల క్రితం నాకు తెలిసిన వ్యక్తి నిజ జీవితం నుంచి స్ఫూర్తిగా తీసుకొని ఈ కథ రాసుకున్నా. అతను చెప్పిన మాటల్లో బావ, బావమరిది బంధం ఎంత గొప్పదో అర్థమైంది. ‘సివప్పు మంజల్’ అనే పేరుతో తమిళంలో రూపొందించాం. సిద్ధార్థ్ బావ పాత్రలో చక్కటి నటనను కనబరిచారు. సున్నితమైన ఉద్వేగాల కలబోతగా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సెంటిమెంట్తో పాటు యాక్షన్ ఘట్టాలు కూడా ఉంటాయి. తప్పకుండా తెలుగుప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు.