నటనతో పాటు సంగీతం, కవితారచనలో కూడా చెన్నై చిన్నది శృతిహాసన్కు మంచి ప్రవేశం ఉన్న విషయం తెలిసిందే. సినిమాలతో పాటు ఇండిపెండెంట్ ఆల్బమ్స్ ద్వారా స్వరకర్తగా సత్తా చాటుకుంది. సంగీత పరిజ్ఞానంతో పాటు తన మనసులోని భావాల్ని కవితారూపంలో వ్యక్తం చేస్తూ శృతిహాసన్ గొప్ప ప్రతిభను కనబరుస్తుంటుంది. చిన్నతనం నుంచే పొయెట్రీ రాయడం సాధన చేశానని..మనసుకు సాంత్వన చేకూర్చే గొప్ప ప్రక్రియ కవిత్వం అని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘స్కూల్రోజుల నుంచి పొయెట్రీ రాయడం అలవాటు చేసుకున్నా. అయితే ఆ తర్వాత కాలంలో కవిత్వ రచనను నేనెప్పుడు సీరియస్గా తీసుకోలేదు. హృదయం సంఘర్షణకు గురైనప్పుడు, ఏవైనా సంఘటనలు నన్ను కదిలించినప్పుడు మనసులోని భావాల్ని అక్షరరూపంలో వ్యక్తం చేస్తుంటా. నాలో చెలరేగే కల్లోలానికి కవిత్వం శాంతిని ప్రసాదిస్తుంది. కాగితంపై పరచుకున్న నా భావాల్ని చూస్తే మాటలకందని అనుభూతికి లోనవుతా’ అని చెప్పింది. ప్రస్తుతం తెలుగులో శృతిహాసన్ ‘సలార్’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది