గత కొన్నేళ్లుగా కథాంశాల ఎంపికలో వైవిధ్యతకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నది శ్రియ. తాజాగా ఆమె మరో ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. శ్రియ, శర్మన్జోషి జంటగా నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్స్కూల్’. పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నేపథ్యగాయకుడు షాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దసరా రోజున ఈ చిత్రం ప్రారంభమైంది. నవంబర్ 15 నుంచి గోవాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నది. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘సంగీతభరిత కథాంశంతో తెలుగు, హిందీ భాషల్లో సినిమాను తెరకెక్కిస్తున్నాం. నేటి విద్యావ్యవస్థలో సృజనాత్మకత లోపించింది. ఇంజినీర్స్, డాకర్లను తయారుచేయాలనే విధానం వల్ల పిల్లలపై ఒత్తిడి పెరుగుతున్నదని చాటిచెప్పే చిత్రమిది. చదువులో కళలు, ఆటలను భాగం చేయాలనే సందేశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాటల రిహార్సల్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభించాం. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే ఇందులో భాగమయ్యారు. శ్రియ, శర్మన్జోషి పాత్రలు సరికొత్తగా ఉంటాయి’ అని తెలిపారు.