హన్మకొండ, ఏప్రిల్ 6: కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా వ్యాక్సినేషన్, పరీక్షల నిర్వహణ, వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజూ జిల్లా పరిధిలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీసం 100, సామాజిక ఆరోగ్య కేంద్రంలో 150, సివిల్ దవాఖానలో 300 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. ఫలితాలను కొవిడ్ యాప్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, పాజిటివ్ వచ్చిన వారిని హోం ఐసొలేషన్ చేయాలని సూచించారు. వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, జిల్లాలో లక్ష్యాల మేరకు పూర్తి చేయాలన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేస్తున్నామన్నారు. వైరస్ వ్యాప్తి ఆధారంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, దవాఖానల్లో చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కొవిడ్ కేర్ సెంటర్లను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీఆర్డీవో ఏ శ్రీనివాస్కుమార్, డీఆర్వో ఎం వాసుచంద్ర , డీఎంహెచ్వో లలితాదేవి, డీపీవో వీ జగదీశ్వర్, కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
జానారెడ్డి గెలిచి ఏం చేస్తారు?