అంబర్పేట నియెజకవర్గంలోని పలు డివిజన్లలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ, గోల్నాక డివిజన్లలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి వీరన్నగుట్ట, కామ్గార్నగర్ తదితర బస్తీలో గురువారం ఎమ్మెల్యే పర్యటించి స్థానికుల నుంచి నీటి, డ్రైనేజీ సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. వీరన్నగుట్ట బస్తీలో ఏండ్లనాటి తుప్పుపట్టిన డ్రైనేజీ పైపులైన్ల ద్వారా కలుషిత నీళ్లు వస్తున్నాయని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఎమ్మెల్యే వీరన్నగుట్టలో ఏండ్లనాటి డ్రైనేజీ పైపులైన్ను తొలగించి నూతన పైపులను వేయాలని జలమండలి అధికారులను అదేశించారు.అదే విధంగా బస్తీ ప్రజల సౌకర్యార్థం బస్తీకి అనుకుని ఉన్న ఖాళీ స్థలానికి ప్రహరీ నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రధాన సమస్య మురుగు ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎప్పుడో ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైపులైన్లు నేటి జనాభా అవసరాలకు అనుగుణంగా లేక పోవడంతో ఈ సమస్య తలెత్తుతోందని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తామని ఆయన అన్నారు.