దాదాపు మూడు నెలల విరామం తర్వాత తెలుగు చిత్రసీమ షూటింగ్లతో కళకళలాడుతోంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్కు ముందు వాయిదా పడ్డ సినిమా చిత్రీకరణలు తిరిగి పునఃప్రారంభమవుతున్నాయి. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో అగ్ర కథానాయకుల సినిమాలు సెట్స్పై సందడి చేస్తున్నాయి. బాలకృష్ణ ‘అఖండ’, మహేష్బాబు ‘సర్కారువారి పాట’, రామ్-లింగుస్వామి చిత్రం, అఖిల్ ‘ఏజెంట్’ చిత్రాలు సోమవారం నుంచి చిత్రీకరణ జరుపుకొంటున్నాయి.
ఐదు నెలల విరామం తర్వాత అగ్రకథానాయకుడు మహేష్బాబు కెమెరాముందుకొచ్చారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ చిత్రీకరణ పునఃప్రారంభమైంది. పరశురామ్ దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తోంది. సోమవారం హైదరాబాద్లో సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ ఏడాది ఆరంభంలో దుబాయ్లో ఫస్ట్షెడ్యూల్ను పూర్తిచేశారు. కమర్షియల్ హంగులకు సామాజికాంశాన్ని మేళవిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: మది, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్.
చివరి షెడ్యూల్లో ‘అఖండ’
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. హైదరాబాద్లో చివరి షెడ్యూల్ ఆరంభమైంది. ఈ షెడ్యూల్తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అఖండ గెటప్లో ఉన్న బాలకృష్ణకు దర్శకుడు బోయపాటి శ్రీను సన్నివేశాన్ని వివరిస్తున్న ఫొటోను చిత్రబృందం విడుదలచేసింది. ‘శక్తివంతమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో బాలకృష్ణ పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుంది. ఇటీవల విడుదలైన టీజర్కు యాభై మిలియన్లకుపైగా వ్యూస్ లభించాయి’ అని నిర్మాత తెలిపారు. ప్రగ్యాజైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
రామ్ యాక్షన్ మొదలు
రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. తొలిరోజు రామ్ షూటింగ్లో పాల్గొన్న ఫొటోను చిత్రబృందం అభిమానులతో పంచుకున్నది. సోమవారం నుంచి ప్రారంభమైన తొలి షెడ్యూల్లో రామ్, కృతిశెట్టిలపై ముఖ్య ఘట్టాలను చిత్రీకరించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
రంగంలో దిగిన ‘ఏజెంట్’
అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అఖిల్ కొత్త స్టిల్ను విడుదల చేశారు. ఇందులో ఆయన కండలు తిరిగిన దేహంతో ప్యాంట్ జేబులో గన్ పెట్టుకొని ైస్టెలిష్గా కనిపిస్తున్నారు. ‘స్పై థ్రిల్లర్ చిత్రమిది. అఖిల్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాగూల్ హెరియన్ ధారుమాన్.