పెద్దేముల్, జూన్ 14: రైతులకు పంట పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి షేక్ నజీరొద్దీన్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో ఆయా గ్రామాల రైతుల నుంచి రైతుబంధు పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఇటీవల కొత్తగా పట్టా పాసుపుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టాపాసుపుస్తకం,ఆధార్ కార్డు, బ్యాంక్ పాసుబుక్ జిరాక్స్లను వ్యవసాయ కార్యాలయంలో అందచేయాలని పేర్కొన్నారు. నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు పెట్టుబడి సాయం జమ అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఈవోలు స్వాతి, వినయ్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
బషీరాబాద్లో..
బషీరాబాద్, జూన్ 14: కొత్తగా పాసు పుస్తకాలు వచ్చిన రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయాధికారి నాగంకృష్ణ సోమవారం తెలిపారు. ఈనెల 10 వరకు కొత్త పాసు పుస్తకాలు వచ్చిన రైతులు తమ పట్టా పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా బుక్కు, ఆధార్ కార్డు జిరాక్స్లను వ్యవసాయ కార్యాలయంలోగాని, సంబంధిత ఏఈవోలకు గాని అందజేయాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి మూడు రోజులు గడువు విధించినట్లు తెలిపారు. రైతుబంధు పొందుతున్న రైతులు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
దోమలో..
దోమ, జూన్14: కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏఈవో కావ్య ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు పట్టా పాసుపుస్తకం, బ్యాంక్ అకౌంట్, ఆధార్కార్డు జిరాక్స్ కాపీలను ఆయా గ్రామాల ఏఈవోలకు అందజేయాలని సూచించారు.