గత కొద్దిరోజులగా తన జీవితం అనేక సవాళ్లు, సంఘర్షణలతో సాగిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేసింది సీనియర్ కథానాయిక శిల్పాశెట్టి. మీడియాలో తన కుటుంబం గురించి వస్తోన్న అసత్య కథనాలు, నెటిజన్ల ట్రోలింగ్ వల్ల మనశ్శాంతి కరువైపోయిందని చెప్పింది. అశ్లీల చిత్రాల కేసులో ముంబయి క్రైమ్బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన తన భర్త రాజ్కుంద్రా గురించి తొలిసారి స్పందించింది శిల్పాశెట్టి. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ఇప్పటివరకు తన భర్తకు సంబంధించిన కేసు గురించి మాట్లాడలేదని, రాబోవు రోజుల్లో కూడా ఇదే పద్దతిని అనుసరిస్తానని పేర్కొంది. ‘నాకు ముంబయి పోలీసులు, భారతీయ న్యాయవ్యవస్థపై అపారమైన గౌరవం ఉంది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది కాబట్టి నేను ఏ విధమైన వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు నా భర్త అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు’ అని శిల్పాశెట్టి వివరణ ఇచ్చింది.
విచారణ పూర్తయ్యేవరకు ఎవరూ ఈ కేసు గురించి అసత్యాల్ని ప్రచారం చేయొద్దని ఆమె కోరింది. ఇద్దరు పిల్లల మాతృమూర్తిగా తన ఫ్యామిలీ ప్రైవసీని గౌరవించాలని శిల్పాశెట్టి విజ్ఙప్తి చేసింది. ముప్పైఏళ్లుగా బాధ్యతాయుతమైన నటిగా పేరు తెచ్చుకున్నానని, ఈ ప్రయాణంలో ఎవరినీ ఇబ్బంది పెట్టే పనులు చేయలేదని ఆమె పేర్కొంది. తన భర్త కేసు గురించి న్యాయస్థానాలు విచారిస్తాయని, మీడియా పరిశోధన ఏమాత్రం అవసరం లేదని ఆమె సున్నితంగా హెచ్చరించింది. చివరగా ‘సత్యమేవ జయతే’ నినాదంతో తన పోస్ట్ను ముగించింది శిల్పాశెట్టి. పోర్న్ కేసులో రాజ్కుంద్రా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీసులు ఇటీవల శిల్పాశెట్టిని కూడా విచారించారు. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.