నిజామాబాద్ సిటీ, మార్చి 23: జిల్లాలో లాటరీల దందా ఆగడంలేదు. లక్కీడ్రాలతో ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. ప్రతినెలా స్కీంలా పేరుతో మభ్యపెట్టి డబ్బులు కట్టించుకొని మోసం చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతి లేకుండా వివిధ ఎంటర్ప్రైజెస్ల పేర్లతో పలు రకాల స్కీంలు నిర్వహిస్తూ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ప్రతినెలా స్కీం పేరుతో జిల్లాలో పెద్ద ఎత్తున సభ్యులను చేర్పిస్తున్నారు. కొత్తకొత్త లాటరీల పేరుతో అమాయకులను వంచిస్తున్నారు. ఈ లాటరీలు ప్రతినెలా జిల్లా కేంద్రంలోనే నిర్వాహకులు డ్రాలు తీస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే పోలీసులు స్పందించి దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, నిరంతంరం పెట్రోలింగ్ నిర్వహించాలని సంబంధిత పోలీసులకు సీపీ కార్తికేయ ఆదేశాలు జారీ చేస్తున్నా ఇలాంటి దందాలు మాత్రం కొనసాగుతూనే ఉండడం గమనార్హం.
మభ్య పెట్టి.. మోసం
జిల్లాలో లాటరీల దందాకు తెరపడడం లేదు. లక్కీడ్రా నిర్వాహకులు మండలాల వారీగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పెద్దమొత్తంలో అమాయకులను సభ్యులుగా చేర్పించుకుంటున్నారు. ప్రతినెలా ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యికి పైగా డబ్బులు కట్టించుకొని దందాను కొనసాగిస్తున్నారు. ఇలా వందల మందిని సభ్యులుగా చేర్పించుకొని డ్రాలు నిర్వహిస్తున్నారు. ప్రతినెలా రూ.వెయ్యి కడితే 16నెలల్లో ఏదో ఓ బహుమతి తప్పనిసరి అని ప్రచారం చేస్తున్నారు. అదృష్టం బాగుంటే కారు, మూడు తులాల బంగారం, మోటార్ సైకిల్, ఎల్ఈడీ టీవీలు, బంగారం, చిన్న చిన్న వస్తువులు లక్కీడ్రాలో పొందవచ్చనే అనే ప్రచారంతో మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. దీంతో వందలాదిమంది ఈ స్కీంలో సభ్యులుగా చేరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఫంక్షన్హాళ్లలో వందల మందిని పిలిచి లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఇంతజరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల లక్కీడ్రా సెంటర్లపై టాస్క్ఫోర్స్ దాడులు
ఇందల్వాయి మండలం కేంద్రంలో ఫిబ్రవరి 11వ తేదీన వేంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ పేరిట నిర్వహిస్తున్న లక్కీడ్రా సెంటర్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో రూ.47వేల నగదు, 40 రసీదు పుస్తకాలు, నాలుగువందల బ్రోచర్లను స్వాధీనం చేసుకొని నిర్వాహకులను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు.జిల్లా కేంద్రంలోని నాల్గో టౌన్ పీఎస్ పరిధిలోని సోని ఫంక్షన్హాలులో శ్రీలత ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు లక్కీడ్రా నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపారు. ఇందులో రూ. 13,450 నగదు, ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.గత సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన నాల్గో టౌన్ పరిధిలోని సూర్యనగర్, యెండల టవర్స్ సమీపంలో దాడులు చేసిన పోలీసులు నిర్వాహకుడు ప్రకాశ్, అక్షర ఏజెన్సీ నిర్వాహకుడు రాజేందర్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
‘లక్కీ డ్రాలు నిషేధం..’
ప్రజలను మోసం చేసే లక్కీ డ్రా స్కీంలను ప్రభుత్వం నిషేధించింది. ఇలాంటి స్కీంలను ప్రజలు నమ్మి మోసపోవద్దు. స్కీంలో సభ్యులుగా చేరాలని ఎవరైనా సంప్రదిస్తే వెంటనే పోలీసులను సమాచారం అందించాలి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా టాస్క్ఫోర్సు ఆధ్వర్యంలో దాడులు జరిపి పెద్ద మొత్తంలో నగదు, వస్తువులను సీజ్ చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశాం.
-షాకీర్ ఆలీ, టాస్క్ఫోర్సు సీఐ