తెలుగు చిత్రసీమలో అరుదైన కలయికకు రంగం సిద్ధమైంది. సున్నితమైన భావోద్వేగాల్ని తెరపై అందంగా ఆవిష్కరించే దర్శకుడు శేఖర్ కమ్ముల, పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ విలక్షణ నటుడిగా జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న తమిళ హీరో ధనుష్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతున్నది. శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నారాయణదాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘నటనను ఎంతగానో ఆస్వాదిస్తూ..ప్రయోజనాత్మక పాత్రల్లో మెప్పించే ధనుష్ వంటి హీరోతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఈ సినిమా కోసం అత్యున్నత ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారని, ఈ ఏడాదిలోనే సెట్స్మీదకు తీసుకొస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలి నారంగ్, నిర్మాతలు: నారాయణ్దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.