న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో ఉగ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తున్నది. ఒక్కరోజులోనే రెండు లక్షలకు పైగా కేసులతో ప్రజలను హడలెత్తిస్తున్నది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,00,739 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఇదే గరిష్ఠం. మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564కు చేరింది. ఇదే సమయంలో కొత్తగా 1,038 మంది మరణించారు. మృతుల సంఖ్య 1,73,123కు పెరిగింది. ప్రస్తుతం 14,71,877 (10.46 శాతం) మంది చికిత్స తీసుకుంటున్నారు. గడిచిన తొమ్మిది రోజుల్లోనే దేశంలో 13,88,515 కేసులు నమోదుకావడం ఆందోళన కలుగజేస్తున్నది. పది రోజుల్లోనే రోజూవారీ కేసులురెట్టింపయ్యాయి.
అమెరికాకు 21 రోజులు.. మనకు 11 రోజులు
రోజూవారీ కేసుల సంఖ్య లక్ష నుంచి రెండు లక్షలు చేరుకోవడానికి అమెరికాలో 21 రోజుల సమయం పడితే, భారత్లో కేవలం 11 రోజుల్లోనే ఈ పెరుగుదల నమోదైంది. బుధవారంనాటికి దేశవ్యాప్తంగా 26,20,03,415 నమూనాలను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో కొత్తగా నమోదైన 2 లక్షల కేసుల్లో 80.76 శాతం కేసులు పది రాష్ర్టాలు.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్లోనే నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మరోవైపు, రోగుల అత్యవసర చికిత్సకు దవాఖానలో పడకల కొరత నేపథ్యంలో ఢిల్లీ, ముంబైలోని ఫైవ్స్టార్ హోటళ్లు, బ్యాంక్వెట్ హాల్స్ను తాత్కాలిక దవాఖానలుగా మార్చుతున్నారు.
ముంబైని దాటిన ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. ఈ ఆంక్షల సమయంలో మాల్స్, జిమ్లు, స్పా సెంటర్లు, ఆడిటోరియాలు మూసి ఉంటాయన్నారు. 30 శాతం సామర్థ్యంతో సినిమా హాళ్లు, రెస్టారెంట్లలో డెలివరీలను మాత్రమే అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 30 వరకు నగరంలో రాత్రి కర్ఫ్యూ ఇదివరకే విధించడం తెలిసిందే. కొత్త కేసుల నమోదులో ముంబై నగరాన్ని ఢిల్లీ దాటేసింది. ముంబైలో ఇప్పటివరకు నమోదైన గఠిష్ఠ కేసులు 11,163 కాగా, ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే 17,282 కేసులు నమోదయ్యాయి. ఏ నగరంలోనూ ఈ స్థాయి కేసులు నమోదుకాలేదు. ఇదిలాఉండగా.. శుక్రవారం నుంచి రాజస్థాన్ అంతటా రాత్రి కర్ఫ్యూ కొనసాగనున్నది.
మూడు రోజుల్లో అనుమతులు
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విదేశాల్లో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లకు దేశంలో అత్యవసర వినియోగానికి సంబంధించిన అనుమతులపై తయారీ సంస్థలు దరఖాస్తును సమర్పించిన మూడు పనిదినాల్లోగా నిర్ణయం తీసుకోనున్నట్టు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గురువారం తెలిపింది.
మర్కజ్లో ప్రార్థనకు 50 మందే: హైకోర్టు
కరోనా విజృంభిస్తున్న వేళ రంజాన్ నేపథ్యంలో నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో ప్రార్థనలకు రోజుకు ఐదు సార్లు 50 మందికి మాత్రమే ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది.