ఉమ్మడి జిల్లాలో బయోగ్యాస్ పేరిట భారీ మోసం
400 మంది పేరిట రూ.1.64 కోట్లు ఖతం
రెండేండ్ల క్రితమే 8 మంది అధికారుల సస్పెన్షన్
రికవరీ కోసం సీఐడీ అధికారుల విచారణ
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ)/కౌటాల రూరల్: నేషనల్ ఎనర్జీ రెనెవెబుల్ డెవలప్మెంట్(ఎన్ఈఆర్డీ)-క్యాప్ పథకం కింద కేంద్ర ప్రభు త్వం 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బయోగ్యాస్ ప్లాంట్లను మంజూ రు చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్నగర్, కౌటాల, సిర్పూర్, దహెగాం, చింతలమానేపల్లి మండలాల్లోని గ్రామీణ పేదలకు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 400 మందిపైగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఒక్కో యూనిట్కు రూ.11వేలు కేటాయించగా.. పనుల బాధ్యతను ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ ప్రతినిధులు సిర్పూర్ నియోజకవర్గంలో ప్రజలకు అవగాహన కూడా కల్పించారు. ఆధార్, రేషన్ కార్డులు తీసుకున్నారు. గురుడుపేట్లో రెండు యూనిట్లను కూడా అమలు చేయగా.. అవి మూతపడ్డాయి. తర్వాత ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు గ్రామీణులు ఆసక్తి చూపకపోవడంతో సంస్థ ప్రతినిధులు వెళ్లి మళ్లీ రాలేదు. కానీ.. గ్రామీణులకు బయోగ్యాస్ యూని ట్లు మంజూరైనట్లు సృష్టించి ఎన్ఈఆర్డీ-క్యాప్ అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు దాదాపు రూ.1.64 కోట్ల నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
రెండేండ్ల క్రితమే వెలుగులోకి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బయోగ్యాస్ పేరిట నిధులను స్వాహా చేసిన విషయం 2019లో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఎనిమిది మంది అధికారులను కూడా సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించారు. బయోగ్యాస్ యూనిట్లు మంజూరైన లబ్ధిదారుల పేరిట నిధులను కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ఈఆర్డీకి చెందిన ఇద్దరు డివిజనల్ మేనేజర్లు, ఇద్దరు అసిస్టెంట్ మేనేజర్లు, నలుగురు ఫీల్డ్ అధికారులను రెండేండ్ల క్రితమే విధుల నుంచి తప్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బయోగ్యాస్ పేరిట నిధుల దుర్వినియోగం జరిగినట్లు వెలుగు చూసింది. ఇదే కాకుండా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఈ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఎన్ఈఆర్డీ అధికారులు నిధులను కాజేసినట్లు ఆరోపణలున్నాయి. కాగా.. బయోగ్యాస్ పేరిట నిధులను కాజేసిన అధికారుల రిటైర్మెంట్ సమయం దగ్గర పడుతుండడంతో సీఐడీ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి డబ్బులు రికవరీ చేయనున్నట్లు తెలుస్తున్నది.