కోయింబత్తూర్: తమిళనాడులోని కోయింబత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ 47 ఏండ్ల మహిళ తన బిడ్డను తలపై రుబ్బురాయితో కొట్టిచంపింది. కోయింబత్తూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని కరమదాయ్ ఏరియాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నాగమణి అనే 47 ఏండ్ల మహిళకు మహాలక్ష్మి అనే ఒక కుమార్తె ఉన్నది. అయితే ఇటీవల ఆమె భర్త చనిపోవడంతో బిడ్డ, కొడుకుతో కలిసి తల్లి దగ్గరే ఉంటున్నది. ఈ క్రమంలో మహాలక్ష్మి గంటల తరబడి వేరే వ్యక్తితో మాట్లాడుతుండటంపై ఇంట్లో తల్లీబిడ్డకు గొడవలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకుని పిల్లలను పట్టించుకోవడం లేదంటూ నాగమణి తరచూ మహాలక్ష్మిని మందలిస్తూ వచ్చింది.
అయినా మహాలక్ష్మి తల్లి మాటలను పెడచెవిన పెడుతూ వస్తున్నది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా తల్లీబిడ్డల మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ మద్యం సేవించి గొడవపడ్డారు. తర్వాత నిద్రలోకి జారుకున్నారు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచిన నాగమణి రాత్రి జరిగిన గొడవను మనసులో పెట్టుకుంది. ఇంట్లో ఉన్న రుబ్బురాయి తీసుకుని గాఢ నిద్రలో ఉన్న కుమార్తె తలపై బలంగా మోదింది. దాంతో మహాలక్ష్మి తలపగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.