ఢిల్లీ,జూన్ 19: రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ అనేక చర్యలు చేపట్టింది. ఈ చర్యలు ఖచ్చితంగా అమలు జరిగితే వచ్చే మూడేండ్లలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల రేటు 50శాతం తగ్గుతుందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రోడ్డు నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. రోడ్ల నాణ్యత , భద్రతా చర్యలను మెరుగుపరచడం ద్వారా 2024 లోపు రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని రోడ్డు రవాణా ,రహదారుల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది.
2030 నాటికి రహదారి భద్రతా చర్యలను పూర్తిగా అమలు చేయడమే తమ లక్ష్యమని నితిన్ గడ్కరీ తెలిపారు. కేంద్ర రవాణాశాఖ ఇప్పటికే దీనికోసం చాలా వరకు కొత్త సంస్కరణ చర్యలు తీసుకుని వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక సంస్థ ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ రహదారి భద్రతా చర్యల గురించి ప్రస్తావించారు.