తెలుగు, తమిళం అని తేడా లేదు.. అన్నిచోట్లా కూడా వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వరసగా కరోనా మరణాలు చూస్తున్న సమయంలో కొందరు ప్రముఖులు అనారోగ్యంతోనూ కన్నుమూస్తున్నారు. మే 18 ఉదయం హీరో రామ్ తాతగారు అలాగే వయోభారంతో చనిపోయారు. తాజాగా తమిళ దర్శకుడు శంకర్ షణ్ముగం ఇంట్లోనూ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈయన తల్లి గారు ముత్తులక్ష్మి వయోభారంతో కన్నుమూసారు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చే సమస్యలతో బాధ పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ముత్తులక్ష్మి వయసు 88 సంవత్సరాలు. చెన్నైలోని స్వగృహంలోనే ఈమె కన్నుమూసారు. దర్శకుడు శంకర్ అమ్మగారు చనిపోయిన విషయం తెలియగానే తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు అంతా ఆయనకు ఫోన్ లో పరామర్శలు తెలియజేస్తున్నారు.
మనోధైర్యంతో ఉండాలని.. అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని ఆయన్ని పరామర్శిస్తున్నారు. శంకర్తో పని చేసిన హీరోలు, నిర్మాతలు ఫోన్ చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఎవరూ ఇంటికి రావద్దంటూ శంకర్ విజ్ఞప్తి చేసారు. ముత్తులక్ష్మి అంత్యక్రియలు చెన్నైలోనే జరగనున్నాయి. శంకర్ ప్రతీ సినిమాకు ముందు అమ్మ ఆశీర్వాదంతోనే మొదలు పెట్టేవాడు శంకర్. సినిమా పూర్తైన వెంటనే ఆమెకు చూపించి అభిప్రాయం అడిగేవాడు. అలాంటిదిప్పుడు ఆమె మరణంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు ఈయన. కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం రామ్ చరణ్తో ఓ పాన్ ఇండియన్ సినిమాకు కమిటయ్యాడు శంకర్. దాంతో పాటు ఇండియన్ 2 సినిమా కూడా లైన్లోనే ఉంది.