హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): పంచాయతీ నిధుల ఆడిట్లో తెలంగాణను ఇతరరాష్ర్టాలు ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటించడంపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణను ఆడిట్తోపాటు అనేక అంశాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దేనని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన అనేక పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. పంచాయతీరాజ్శాఖ అనేక అంశాల్లో కేంద్ర ప్రశంసలు, అవార్డులను అందుకున్నదని, కానీ కేంద్రం రాష్ర్టానికి అదనంగా ఒక్కపైసా ఇవ్వడంలేదని ఆక్షేపించారు. పంచాయతీరాజ్శాఖకు ప్రశంసలు రావడానికి కృషిచేసిన శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్రావు, అధికారులు, సర్పంచ్లకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.