‘సినీ ప్రయాణంలో ఇప్పటివరకు యాభై సినిమాలు చేశా. యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ అన్ని జోనర్లలో విభిన్నమైన పాత్రలు చేశా. కానీ పౌరాణిక సినిమా చేయలేకపోయాననే వెలితి తొలినాళ్ల నుంచి ఉంది. ఆ కల ఈ సినిమాతో తీరడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది సమంత. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకుడు. డీఆర్పీ-గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై దిల్రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. దేవ్ మోహన్ కథానాయకుడు. సోమవారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్నివ్వగా, దిల్రాజు కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ‘డిస్నీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. బాధ కలిగిప్పుడు డిస్నీ సినిమాలు చూస్తూ స్వాంతన పొందుతాను. దిల్రాజు, గుణశేఖర్ కలిసి శాకుంతలం రూపంలో నాకో పెద్ద బహుమతి ఇచ్చారు’ అని తెలిపింది. దిల్రాజు మాట్లాడుతూ ‘గుణశేఖర్ కథ చెబుతున్నప్పుడు సమంతను విజువలైజ్ చేసుకుంటూ విన్నా. ‘అరుంధతి’, ‘మహానటి’ మాదిరిగా శక్తివంతమైన సినిమా అవుతుందనిపించింది. పీరియాడికల్ అంశాలకు నాటకీయత, ఉద్వేగాలు మేళవిస్తూ అద్భుతంగా గుణశేఖర్ కథ రాశారు. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. 2022 సంవత్సరంలో విడుదలచేయబోతున్నాం’ అని తెలిపారు. గుణశేఖర్ మాట్లాడుతూ ‘పాన్ ఇండియన్ సినిమా ఇది. దిల్రాజుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. కథ దగ్గర నుంచి నిర్మాణపు విలువలకు వరకు ప్రతి విషయంలో ఆయన సినిమాకు అండగా నిలుస్తున్నారు. ఈ సినిమా ద్వారా నా పెద్ద కుమార్తె నీలిమ నిర్మాతగా పరిచయం అవుతోంది. నాయికప్రాధాన్యమున్న ఈ సినిమాలో శకుంతల పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలనే ప్రశ్న తలెత్తినప్పుడు చాలా మంది సమంత పేరును సూచించారు. కథ విని శకుంతల భావాలకు సమంత కనెక్ట్ అయ్యారు. ఈ పాత్ర కోసం సంప్రదాయ కళల్లో శిక్షణ తీసుకున్నారు. దుష్యంతుడిగా దేవ్మోహన్ కనిపిస్తారు. సమంత, దేవ్మోహన్ పాత్రలు పోటాపోటీగా సాగుతూ ప్రణయకావ్యంగా ఈ సినిమా ఉంటుంది. సమంత, దిల్రాజు సినిమాలో భాగం కావడంతో నేను అనుకున్న కథను తెరపై తీసుకురాగలననే నమ్మకం ఏర్పడింది’ అని తెలిపారు. చాలెంజింగ్ పాత్రతో తెలుగు చిత్రసీమకు పరిచయం కానుండటం ఆనందంగా ఉందని దేవ్మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నీలిమ గుణ, దిల్రాజు తనయ హన్షితరెడ్డి పాల్గొన్నారు.