పదో తరగతి వార్షిక పరీక్షల్లో అమలు
కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం
మే 17 నుంచి ఇయర్లీ ఎగ్జామ్స్
భూపాలపల్లిరూరల్, ఏప్రిల్ 13 :కొవిడ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను జాగ్రత్తల నడుమ నిర్వహించేందుకు విద్యా శాఖ సమాయత్తమవుతున్నది. భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష గదిలో బెంచికి ఒక్క విద్యార్థే కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. వచ్చే నెల 17వ తేదీ నుంచి ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగనున్న క్రమంలో విద్యార్థుల కోసం అదనపు గదులను కేటాయించనుంది.
పదో తరగతి పరీక్షలు కొవిడ్ నిబంధనలను అనుగుణంగా నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. బెంచికి ఒక విద్యార్థి మాత్రమే కూర్చునేందుకు వీలుగా మరిన్ని అదనపు పరీక్ష కేంద్రాల ను ఏర్పాటుచేస్తోంది. ఈమేరకు ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశారు. గతేడాది వైరస్ కారణంగా పరీక్షల్లేకుండానే అందరినీ ఉత్తీర్ణుల్ని చేస్తూ ప్రభుత్వం ఫలితాలను ప్రకటించింది. ఈసారి విద్యా ర్థులకు ఏమాత్రం ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తరగతి గదుల్లో విద్యాబోధనను రద్దు చేసి ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తోంది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగా హనను మరింత అర్థం చేసుకునేందుకు ఉచితంగా విద్యార్థుల కు స్టడీ మెటీరియల్ అందించింది. 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని మే 17 నుంచి 26 వరకు పరీక్షలు ఉంటాయని ఇప్పటికే ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్ష ఫీజు చెల్లింపు తుది గడువు ముగిసినందున ఇక పరీక్షా కేంద్రాల గుర్తింపుపై జిల్లా విద్యాశాఖ అధికారులు దృష్టిపెట్టారు.
భూపాలపల్లి జిల్లాలో 30 కేంద్రాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 146 ఉన్నత పాఠశాలలు ఉండగా ఇందులో 24 పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఒకరు కూడాఅడ్మిషన్ తీసుకోకపోవడంతో జీరో అడ్మిషన్ కలిగి ఉన్నా యి. మిగిలిన 122 పాఠశాలల్లో 3,899 మంది చదువుకుంటున్నా రు. ఇందులో బాలికలు 1997 మంది, బాలురు 1902 మంది ఉన్నారు. గతేడాది 28 కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ కరోనా కారణంగా పరీక్షలు జరుగకుండానే పాస్ చేశారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, ఇబ్బందుల్లేకుండా జిల్లాలో 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఇందులో భాగంగా భూపాలపల్లి మండలంలో 8, చిట్యాల మండలంలో 3, గణపురం లో 2, టేకుమట్లలో 1, కాటారంలో 4, మహదేవ్పూర్లో 3, మహా ముత్తారంలో 1, మొగుళ్లపల్లిలో 3, రేగొండలో 3, మల్హర్రావు మండలంలో 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.