యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తల్లీ కొడుకుల మధ్య సెటిమెంట్ ను కూడా పూరీ ఇందులో టచ్ చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిలిచిపోయింది. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో సినిమాని మళ్లీసెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్స్ చేస్తున్నారు మేకర్స్.
లైగర్ సినిమాకి సంబంధించి విశేషాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు విజయ్ దేవరకొండ. లైగర్ చిత్రీకరణ 65 శాతం పూర్తైందని చెప్పిన విజయ్ ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ కోసం సుమారు వెయ్యి మందికి పైగా అవసరం ఉందని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంతమందితో షూటింగ్ అంటే రిస్క్ తో కూడుకున్న పని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ అవకాశాలను కూడా ఆలోచించి షూటింగ్ ప్లాన్ రెడీ చేస్తున్నామని దేవరకొండ విజయ్ పేర్కొన్నారు.
లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తుండగా, విలక్షణ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో విజయ్ తల్లి పాత్ర పోషిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్న ఈ సినిమాలో రౌడీ దేవరకొండ ఓ కిక్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ‘లైగర్’ కోసం జాకీచాన్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ వర్క్ చేస్తున్నారు . ఈ మూవీ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి