హైదరాబాద్ : రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారందరికి గురువారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ వేయనున్నట్లు డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీహెచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 45 ఏళ్లు దాటినవారు సుమారు 80 లక్షల మంది ఉన్నారన్నారు. ఇప్పటికే హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు తొలి విడత టీకా పూర్తైనట్లు చెప్పారు. ఆరోగ్య సమస్యలున్న 45 ఏళ్లు దాటినవారికి టీకా వేయనున్నట్లు తెలిపారు. దాదాపు 10 లక్షల మందికి తొలి విడత టీకా ఇచ్చామన్నారు.
రోజుకు లక్ష మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వెయ్యి ప్రభుత్వ, 250 ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జ్వరం, జలుబు, దగ్గు ఉంటే ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే వారిలో లక్షణాలుంటే పరీక్షలు చేయాలన్నారు. శస్త్ర చికిత్సకు ముందు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలన్నారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రజారోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.