సీనియర్ హీరో వేణు తెలుగు చిత్రసీమలో పునరాగమనం చేయబోతున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన రీఎంట్రీ ఇవ్వబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే… రవితేజ కథానాయకుడిగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరో వేణు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ‘స్వయంవరం’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు వేణు. తొలి చిత్రంలోనే చక్కటి నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. అనంతరం ‘చిరు నవ్వుతో’ ‘చెప్పవే చిరుగాలి’ ‘కల్యాణ రాముడు’ ‘పెళ్లాం ఊరెళ్తే’ ‘ఖుషిఖుషిగా’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. 2013 నుంచి ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.