మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 20: రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీసుశాఖ తగు చర్యలు చేపడుతుందని ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మంగళవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూ ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు, వ్యాపారవేత్తలు పోలీసువారికి సహకరించాలని, ఎమర్జెన్సీ సర్వీసులు పెట్రోల్ బంకులు, మీడియా, ఇతర అత్యవసర విభాగాలకు మినహాయింపు ఉంటున్నదని ఎస్పీ వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కర్ఫ్యూ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినవారిపై విపత్తుల నివారణ చట్టాల మేరకు జరిమానాలతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, రెస్టారెంట్లను రాత్రి ఎనిమిది గంటల లోపు మూసివేయాలన్నారు. రాత్రి 9గంటల నుంచి కర్ఫ్యూ పటిష్ఠంగా అమలు, కర్ఫ్యూ సమయంలో మినహాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు విధిగా తప్పనిసరిగా ఐడీకార్డులను కలిగి ఉండాలన్నారు. ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లే ప్రయాణికులు వ్యాలిడ్ టికెట్లను తమవద్ద ఉంచుకుని కర్ఫ్యూ సమయంలో వాటిని చూపించాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రజలు, వ్యాపార వర్గాలు, ఉద్యోగులతోపాటుగా అన్నివర్గాలవారు పోలీసులతో సహకరించాలి. మనలను మనం కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించి బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఎస్పీ వెంకటేశ్వర్లు కోరారు.
కర్ఫ్యూ నిబంధనలపై అవగాహన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించిన నేఫథ్యంలో జిల్లా కేంద్రంలో పరిస్థితులను ఎస్పీ వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో దుకాణాదారులకు కర్ఫ్యూ సమయంపై అవగాహన కల్పించారు. కరోనా మహమ్మారి బారినుంచి ప్రజలను రక్షించుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. వినియోగాదారులకు తెలిసేవిధంగా దుకాణాల ఎదుట సమయాన్ని తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని, మనందరం కలిసికట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారిని సమూలంగా నిర్మూలించవచ్చని, మునుపటి సంతోషకర వాతావరణం నిర్మించుకోవచ్చని భరోసా కల్పించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
అభాగ్యులకు అండగా సీఎంఆర్ఎఫ్
అభాగ్యులకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ ముత్యాల రవీందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయ ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన 14మంది బాధితులకు రూ.10లక్షల విలువ జేసే సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ, జెడ్పీటీసీ మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యంతో దవాఖానపాలైన వారిని సీఎం సహాయనిధితో ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్లాంటి సీఎం తెలంగాణ రాష్ర్టానికి పదికాలాలపాటు అవసరమని తెలిపారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, సర్పంచ్ గోపాల్గౌడ్, నాయకులు ప్రతాప్, గోపాల్, నారాయణ, అబ్దుల్అలీ, శ్రీశైలం, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని నవాబ్పేట సర్పంచ్ గోపాల్గౌడ్ కోరారు. మండల కేంద్రంలోని వివిధ వార్డుల్లో ఆయన పంచాయతీ సిబ్బందితో కలిసి పర్యటించి పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ పిచికారీ, రసాయనాలను స్ప్రే చేయించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్కు లేకుండా ఇంటినుంచి బయటకు వస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను విధిగా పాటించాలన్నారు. రాత్రి 9గంటల తర్వాత ఎవరైనా రోడ్డుపై తిరిగితే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దీప్తి, నాయకులు నర్సింహులు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.