జైపూర్: పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్తున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం విధించే దిగుమతి సుంకాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తదితర పన్నులు వసూలు చేస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేయడం లేదు. కానీ పెట్రోల్, డీజిల్లపై రాజస్థాన్ ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ పన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర పెట్రోల్ పంప్ డీలర్లు ఆదివారం సమ్మెకు దిగారు.
సమ్మెవల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,000 పెట్రోల్ పంప్లు మూతపడ్డాయి. అయితే, నేరుగా కేంద్ర చమురు సంస్థల ఆధీనంలోని పెట్రోల్ పంపులు మాత్రం వినియోగదారుల కోసం యధావిధిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
రాష్ట్ర పెట్రోల్ పంప్ డీలర్ల సంఘం అధ్యక్షుడు సునీత్ బగాయి స్పందిస్తూ.. వ్యాట్ విత్ డ్రా చేసుకోవాలన్న డిమాండ్తో పెట్రోల్ పంపులన్నీ మూత పడ్డాయని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రభావం వెంటాడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వ్యాట్ పెంచేసిందని ఆరోపించారు.
ఇతర రాష్ట్రాల్లో ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయని సునీత్ బగాయి తెలిపారు. తత్ఫలితంగా రాష్ట్రంలో పెట్రోల్ విక్రయం 34 శాతం పడిపోయిందని సునీత్ బగాయి పేర్కొన్నారు.
తమ డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించామని సునీత్ బగాయి తెలిపారు. ఈ నెల 25లోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం జరుగకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.