‘జెన్యూన్ హిట్ అనే మాటను నేను విని చాలా ఏళ్లు అయ్యింది. ఈ మధ్యకాలంలో నా సినిమాలేవి సరిగా ఆడలేదు. చిత్రఫలితం ఏమిటనేది విడుదల రోజు నాకు వచ్చే ఫోన్ కాల్స్ చెబుతాయి. ఈ సినిమా రిలీజ్ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. అప్పుడే సినిమా హిట్ అని అర్థమైంది’ అని అన్నారు గోపీచంద్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘సీటీమార్’. సంపత్నంది దర్శకుడు. శ్రీనివాసచిట్టూరి నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మంగళవారం హైదరాబాద్లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో షూటింగ్ చేయడం సులభం కాదు. మనసులో భయాలున్నా ధైర్యంగా ప్రతి ఒక్కరూ సినిమా కోసం పనిచేశారు. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. పండుగలాంటి మంచి సినిమాను మాకు అందించారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. బోల్డ్ పాత్రలో తమన్నా చక్కటి నటనను కనబరిచింది. మహిళల్లో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపే పాత్రలో ఒదిగిపోయింది.
ఈ సినిమా హిట్ కాకపోతే మా కష్టాలు మరింత పెరుగుతాయనే భయం నాతో పాటు సంపత్నందిలో షూటింగ్ సమయంలో ఉండేది. అందుకే హిట్ కొట్టాలనే తపనతో కష్టపడి పనిచేశాం. సెకండ్ వేవ్ తర్వాత కఠిన పరిస్థితుల్లోనూ పెద్ద విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. సంపత్నంది మాట్లాడుతూ “గౌతమ్నందా’తో గోపీచంద్కు బ్లాక్బస్టర్ విజయాన్ని ఇవ్వాలనుకున్నా. కానీ అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఆడలేదు.
ఈ సినిమాతో గోపీచంద్ బాకీ తీర్చేశాను. మా అందరి కెరీర్లో గుర్తుండిపోయే విజయమిది. మణిశర్మ, సౌందర్రాజన్తో పాటు ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడిదే ఈ సక్సెస్ క్రెడిట్. స్త్రీసాధికారత గురించి సినిమాలో మేము చెప్పిన పాయింట్ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది. వంద రూపాయల టికెట్ వ్యయానికి పదిరెట్ల రెట్టింపు ఆనందాన్ని ఇస్తున్న సినిమా ఇదని అభినందిస్తున్నారు’ అని పేర్కొన్నారు. తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయే విజయమిదని తమన్నా చెప్పింది.