నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ)/హాలియా: కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి స్వగ్రామమైన అనుములలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. టీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ మంగళవారం సాయంత్రం 6గంటలకు అనుముల గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే ముందస్తుప్రణాళికతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు తమ గ్రామానికి రావద్దంటూ రోడ్డుకు అడ్డం గా బైఠాయించారు. టీఆర్ఎస్ నాయకులు సంయమనంతో వ్యవహరించి నచ్చజెప్పే ప్రయత్నం చేశా రు. పోలీసులు రంగప్రవేశం చేసినా ఫలితం లేకపోయింది. పోలీసుల జోక్యంతో ప్రచార రథం కొద్దిదూరం వెళ్లేలోపే జానారెడ్డి తనయుడు జయవీర్రెడ్డి నేతృత్వంలో కొందరు మళ్లీ అడ్డుకోబోయారు. పోలీసులతో జయవీర్రెడ్డి వాదనకు దిగుతూ మరోసారి నోముల భగత్ వాహనాన్ని అడ్డుకుని ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఇంతలో డీఐజీ ఏవీ రంగనాథ్ పోలీసు సిబ్బందితో వచ్చి టీఆర్ఎస్ ప్రచార రథానికి అడ్డుగా నిలబడ్డ కాంగ్రెస్ నాయకులకు సర్దిచెప్పారు. అయినా వినకపోవడంతో ప్రత్యే క బలగాలు కాంగ్రెస్ కార్యకర్తలను అక్కడి నుంచి బలవంతంగా పంపించి వేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. జానారెడ్డి కొడుకులు పథకం ప్రకారమే మంగళవారం సాయంత్రం అనుములలో టీఆర్ఎస్ ర్యాలీపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయించారన్నారు. జానారెడ్డి ఆటలు ఇక సాగవని మంత్రి హెచ్చరించారు. రేవంత్రెడ్డి లాంటి విషపురుగులు వచ్చి ఇక్కడ అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, జానారెడ్డి తన పెద్దరికాన్ని నిలబెట్టేలా వ్యవహరిస్తే మంచిదన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా ఈ నెల 17న సాగర్ ప్రజలు జానారెడ్డికి సరైన బుద్ధిచెప్పేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారని చెప్పారు. అనుములలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారాన్ని అడ్డుకుని వీధి రౌడీలా వ్యవహరించిన జానారెడ్డి తనయుడు జయవీర్రెడ్డి తీరును రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరించిన తీరును బలహీన వర్గాలపై దాడిగానే పరిగణిస్తామని వారు హెచ్చరించారు.