కింగ్ నాగార్జున ఈ ఏడాది వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకులని పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అభిమానులని నిరాశపరచడంతో తదుపరి సినిమాలపై హోప్స్ పెట్టుకున్నాడు. ప్రస్తుతం నాగార్జున డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందనున్న మూవీ ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్లపై నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
గత కొద్ది రోజులుగా ప్రవీణ్ సత్తారు- నాగార్జున సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు షికారు చేశాయి. కాని అవన్నీ తప్పుడు వార్తలంటూ మేకర్స్ ఖండించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సెకండ్ షెడ్యూల్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.