“టాక్సీవాలా’ తర్వాత దాదాపు ఇరవై ఐదు కథలు విన్నా. మంచి సినిమా చేయాలనే ఆలోచనతో రెండేళ్లు విరామం తీసుకున్నా’ అని తెలిపింది ప్రియాంక జవాల్కర్. ఆమె కథానాయికగా నటించిన ‘తిమ్మరుసు’, ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ చిత్రాలు ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ప్రియాంక జవాల్కర్ పాత్రికేయులతో మాట్లాడుతూ “తిమ్మరుసు’లో లాయర్గా పరిణతితో కూడిన నటనను కనబరిచానని చెబుతున్నారు. ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించినా వసూళ్లు మాత్రం బాగున్నాయి. రాయలసీమ ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటున్నది. ‘తిమ్మరుసు’లో చాలా బొద్దుగా కనిపించాననే కామెంట్స్ వినిపించాయి. కెరీర్ను నేను నిర్లక్ష్యం చేస్తున్నానంటూ విమర్శలొచ్చాయి. థైరాయిడ్ సమస్యల వల్ల బరువు పెరిగాను. డాక్టర్స్ సలహాలు తీసుకుంటూ కష్టపడి ఫుడ్ కంట్రోల్తో పాటు వర్కవుట్స్ ద్వారా బరువు తగ్గా. నేనే స్వయంగా వంట చేసుకున్నా . నటనా పరంగా నేను చేసిన తప్పొప్పుల్ని స్నేహితుల ద్వారా తెలుసుకుంటా. సినిమా పూర్తయిన తర్వాత స్క్రీన్పై చూసుకుంటే నాకు అన్నీ తప్పులే కనిపిస్తాయి. స్వీయ విశ్లేషణ చేసుకునే పరిణతి నాకు ఇంకా రాలేదు. ‘గమనం’ సినిమాలో నటనకు ఆస్కారమున్న పాత్ర చేశా. తమిళంలో ఓ చిత్రాన్ని అంగీకరించా’ అని చెప్పింది.