సినిమాలను థియేటర్లోనే విడుదల చేసి వాటిని కాపాడాలని తెలుగు సినిమా నిర్మాతలకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి చేసింది. అక్టోబర్ వరకు వేచిచూసి ఆ తరువాత థియేటర్లు ప్రారంభం కాకపోతే నిర్మాతలు ఓటీటీలో సినిమాలు విడుదల చేయాలని కోరింది. బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫిలింఛాంబర్ సెక్రటరీ సునీల్ నారంగ్ మాట్లాడుతూ ‘ఆగస్టు మొదటివారంలో కరోనాకు ముందు పరిస్థితులు వచ్చే అవకాశం వుంది. కానీ ఈలోపే చిన్న నిర్మాతలతో పాటు పెద్ద నిర్మాతలు కూడా సినిమాలను ఓటీటీలో విడుదల చేయడం ఇబ్బందిగా వుంది. అక్టోబర్ 30 వరకు వేచిచూసి ఆ తరువాత నిర్ణయం తీసుకుని సినిమాని, థియేటర్లని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అన్నారు. థియేటర్ వ్యవస్థను ఓటీటీలు కిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, ఇది నిర్మాతల మనుగడకు కూడా ప్రమాదకరమని తెలంగాణ థియేటర్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి తెలిపారు. థియేటర్లో సినిమా విడుదలైన 20 రోజులకు ఓటీటీ హక్కులు ఇవ్వాలని, సినిమా పరిశ్రమపై ఆధారపడి చాలా కుటుంబాలు జీవిస్తున్నాయని ఛైర్మన్ డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభిషేక్ నామా చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మురళీమోహన్, వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ , ఎగ్జిబిటర్స్ సదానంద గౌడ్, సుధా థియేటర్ అనుపమ రెడ్డి కూడా పాల్గొన్నారు.