న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం తీసుకురానున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం ప్రకటించారు. నిత్యావసర సరుకుల (సవరణ).. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) బిల్లు.. రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు తీసుకువచ్చి గత ఏడాది పార్లమెంట్లో ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని, ఈ మేరకు అవసరమైన చట్టాన్ని ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.
గత ఎన్నికల్లో డీఎంకే ఎన్నికల్లో చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకువస్తామని హామీ ఇచ్చామని, ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టి ఆరు నెలలు గడిచిందని స్టాలిన్ పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులతో నిర్మాణాత్మకమైన చర్చలు జరిపేందుకు ప్రయత్నించలేదని విమర్శించారు. చట్టాలను ఉపసంహరించుకునే చర్యలు తీసుకోలేదని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు.