‘కథాబలమున్న మంచి సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ‘రాజరాజ చోర’ మరోసారి రుజువు చేసింది’ అని అన్నారు అభిషేక్ అగర్వాల్. టీజీ విశ్వప్రసాద్తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. శ్రీవిష్ణు హీరోగా నటించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో అభిషేక్ అగర్వాల్, సహనిర్మాత వివేక్ కూచిభొట్ల పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఊహించని విజయమిది. విడుదలైన ప్రతి చోట వసూళ్లు బాగున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ పరంగా కొన్ని సమస్యలున్నా కలెక్షన్స్ విషయంలో సంతృప్తిగా ఉన్నాం. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ర్టాల వారు సినిమాను ఆదరిస్తున్నారు. మంచి కిక్ను ఇచ్చిన విజయమిది. కామెడీతో పాటు హీరోలో మార్పు వచ్చే సన్నివేశాల్ని దర్శకుడు హృద్యంగా మలిచారు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్త భాగస్వామ్యంలో కల్యాణ్దేవ్ హీరోగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాం. ‘కార్తికేయ-2’ ఫైనల్ షెడ్యూల్లో ఉంది. అలాగే గూఢచారి-2 కూడా కలిసి నిర్మించబోతున్నాం’ అని తెలిపారు.