సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ కందెరావ్ దర్శకుడు. పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్లుక్ను ఆదివారం కథానాయిక తమన్నా విడుదలచేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘1979 బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడికల్ చిత్రమిది. అమెరికా స్పేస్ స్టేషన్ ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూగోళం నాశనమైపోతుందని అప్పట్లో వార్తలొచ్చాయి. ప్రపంచంలోని అన్ని న్యూస్ఛానల్స్, పత్రికల్లో ఆ సంఘటనకు సంబంధించిన కథనాలు వచ్చాయి. స్కైలాబ్ ఘటన తెలుగు రాష్ట్రంలోని బండలింగపల్లిలో ఉండే గౌరి, ఆనంద్, రామారావు జీవితాల్లో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందనేది ఈ చిత్ర ఇతివృత్తం. ఆద్యంతం వినోదప్రధానంగా ఈసినిమా సాగుతుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాల్ని వెల్లడిస్తాం’ అని అన్నారు. తనికెళ్లభరణి, తులసి ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాత: నిత్యామీనన్, కెమెరామెన్: ఆదిత్య జవ్వాది, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి.