పదవులపై ఆశ లేకపోతే పోటీ ఎందుకు?
ఆయన గెలిస్తే అభివృద్ధి ఆగిపోతది
అభివృద్ధి చేసే టీఆర్ఎస్కే ఓటేయండి
ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్రెడ్డి
హాలియా, ఏప్రిల్ 15: ‘కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి మూడున్నర దశాబ్దాలు నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తుండు. ఆయన 35 ఏండ్లు ఎమ్మెల్యేగా, 17 ఏండ్లపాటు మంత్రిగా కొనసాగినా నియోజకవర్గంలో వాగులపై వంతెనలు ఏర్పా టు చేయలేకపోయారు. రోడ్లు సక్రమంగా లేవు. హాలియాలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. పదవులపై జానారెడ్డికి ఆశ లేకపోతే 73 ఏండ్ల వయస్సులో ఎందుకు పోటీ చేస్తున్నట్టు’ అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం 7గంటలకు ముగిసింది. అంతకుముందే నేతలు ప్రచా రాన్ని ముగించారు. చివరిరోజు ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి హాలియా మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించారు. అలాగే, నందికొండ మున్సిపాలిటీలో, త్రిపురారంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంపీ బడుగుల లింగయ్యతో కలిసి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. సాగర్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని, జానారెడ్డి వ్యవహారం తెలిసి 2018లోనే ఆయ న్ను ఇంటికి పంపించారని తెలిపారు. ఇప్పుడాయన గెలిచే ప్రసక్తే లేదని, ఒకవేళ గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఆగిపోతదన్నా రు. 35 ఏండ్లలో జానారెడ్డి చేసిన ఒక్క గొప్ప పనిలేదన్నారు. జానారెడ్డి గతంలో ఏం చేసిండో చెప్పడు.. ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తడో కూడా చెప్పడని ఎద్దేవా చేశా రు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆకలిని, ఆత్మహత్యలను పారదోలామని చెప్పారు. హాలియా, నాగార్జున సాగర్ను మున్సిపాలిటీలుగా చేయడంతోపాటు తిరుమలగిరి సాగర్ మండలాన్ని, 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా చేశామన్నారు. 70 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చామన్నారు. ఇప్పుడు జానారెడ్డి గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఆగిపోతదని, మరో పదేండ్లు వెనక్కి పోతదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అభివృద్ధి కోసం భగత్ గెలువాలి : పోచంపల్లి
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే నోముల భగత్ భారీ మెజార్టీతో గెలువాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ప్రజలకు సూచించారు. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి, బాబుసాయిపేట, త్రిపురారం గ్రామాల్లో చేపట్టిన ప్రచారంలో ఆయన మాట్లాడా రు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఓటమి ఖాయమైందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అభ్యర్థి భగత్ తదితరులు పాల్గొన్నారు.
భగత్ విజయం ఖాయం : మంత్రి తలసాని
హాలియా, ఏప్రిల్ 15 : సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం ఖాయమని, భగత్ గెలుపుతోనే నియోజకవర్గ ప్రజల తలరాతలు మారుతాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హాలియాలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం బహిరంగ సభ ను అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమైన కాంగ్రెస్ నాయకులు కారుకూతలు కూస్తున్నారని తలసాని మండిపడ్డారు. జానారెడ్డి ప్రజాస్వామ్య విలువలు, నీతి, ధర్మం గురించి శ్రీరంగ నీతులు చెబుతుండు. కానీ.. ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులు బూతు పురాణాలు మాట్లాడుతుంటే నోరు మెదపడం లేదన్నారు. ప్రజలను మరోసారి మభ్య పెట్టేందుకు మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంచుతూ ఎన్నికల అధికారులకు దొరికింది జానారెడ్డి అనుచరులేనన్నారు.
మీ కొడుకునై సేవ చేస్తా : నోముల భగత్
తన తండ్రి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇచ్చిన హామీలన్నీ సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి సహాయ సహకారాలతో నెరవేరుస్తానని, మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిపించాలని టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కోరారు. సంక్షేమ పథకాలు గడప గడపకూ చేరాలంటే, నెల్లికల్ లిఫ్టు పనులు పూర్తి కావాలంటే కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు శంకర్నాయక్, శానంపూడి సైదిరెడ్డి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస్గుప్తా పాల్గొన్నారు.