సంప్రదాయ నృత్యప్రధాన కథాంశాలతో తెలుగు తెరపై సినిమా వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. కె. విశ్వనాథ్, జంధ్యాల వంటి దిగ్గజ దర్శకులు నాట్యకళ ఔన్నత్యాన్ని చాటుతూ సాగర సంగమం, స్వర్ణకమలం, ఆనందభైరవి వంటి సినిమాల్ని తెరకెక్కించి అద్వితీయ విజయాల్ని అందుకున్నారు. ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు రావడం, కళాత్మక సినిమాల్ని తెరకెక్కించే దర్శకుల సంఖ్య తగ్గడంతో నృత్యకళ నేపథ్య చిత్రాల సంఖ్య తగ్గింది. చాలా కాలం తర్వాత ఈ కథాంశంతో తెలుగు తెరపై వచ్చిన చిత్రం ‘నాట్యం’ (Natyam).
కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు (Sandhya Raju) ప్రధాన పాత్రలో నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. రేవంత్ కోరుకొండ (Revanth Korukonda) దర్శకత్వం వహించారు. ఈ కంటెంట్ ఓరియెంటెండ్ సినిమాకు చిరంజీవి, రామ్చరణ్, నాగార్జున వంటి అగ్రనటులు అండగా నిలవడంతో అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. నాట్యకళ విశిష్టతను చాటిచెబుతూ తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే…
స్వాతంత్య్రానికి పూర్వం నుంచి సంప్రదాయ నృత్య కళలకు నాట్యం అనే గ్రామం ప్రసిద్ధి చెందుతుంది. భారతీయ సంస్కృతులు, సంప్రదాయాలను నాశనం చేయాలనే సంకల్పంతో బ్రిటీష్ పాలకులు ఆ ఊరిలోని నాట్యశాస్త్ర గ్రంథాలను తగలబెడతారు. నాట్యకళను బ్రతికించాలని ప్రయత్నించిన కాదంబరి అనే యువతిని చంపేస్తారు. బ్రిటీష్ పాలకులు కాల్చివేసిన గ్రంథాలు ఆ ఊరిలో వెలసిన అమ్మవారి అనుగ్రహంతో తిరిగి వెలుగులోకి వస్తాయి. ఆ ఊరికి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. అదంతా అమ్మవారి లీలలని ఊరందరూ విశ్వసిస్తుంటారు. అదే ఊరికి చెందిన సితారకు(సంధ్యారాజు) నృత్యం అంటే ఇష్టం. గురువుకు(ఆదిత్యమీనన్) ఇష్టమైన శిష్యురాలిగా పేరుతెచ్చుకుంటుంది.
కాదంబరి కథను ప్రజలకు చెప్పాలనే గురువు కలను నెరవేర్చాలని తపన పడుతుంది. కానీ ఆ కథను చెప్పాలని ప్రయత్నించిన వారందరూ మరణిస్తుంటారు. సితార ప్రాణాలు పోతాయనే భయంతో గురువు ఆమెను వారిస్తాడు. కానీ సితార మాత్రం పట్టుదలగా ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో ఊరి నుంచి బహిష్కరణకు గురవుతుంది. తాను ప్రేమించిన రోహిత్ సహకారంతో కాదంబరి కథను సితార చెప్పగలిగిందా?గురువు లక్ష్యాన్ని నెరవేర్చిందా?అసలు కాదంబరి ఎవరు? ఆమె ప్రాణత్యాగం వెనకున్న రహస్యమేమిటి?నాట్యకళ ద్వారా ఆ ఊరి ప్రజల్లో పేరుకుపోయిన మూఢనమ్మకాన్ని సితార ఎలా చెరిపివేసిందన్నది మిగతా కథ.
నాట్యకళతో ప్రేమకథను తెలియజేసే కథాంశంతో..
నాట్యం అంటే కాళ్లు, చేతులను ఆడించడం కాదు. గొప్ప కథలను చెప్పే శక్తి నాట్యానికి ఉందనే పాయింట్తో రూపొందిన చిత్రమిది. చరిత్రలో మరుగున పడిన ఓ నృత్యకళాకారిణి త్యాగాన్ని, ఆమె ప్రేమకథను నాట్యం ద్వారా ప్రపంచానికి ఓ యువజంట ఎలా తెలియజేసిందనే కథాంశంతో దర్శకుడు రేవంత్ కోరుకొండ ఈ సినిమాను తెరకెక్కించారు. సంప్రదాయం, వెస్ట్రన్ కళారూపం ఏదైనా వాటి ఆత్మ ఒక్కటేనని చూపించారు.
బ్రిటీష్ చరిత్రకు నేటి కాలాన్ని ముడిపెడుతూ కథను బాగా రాసుకున్నారు దర్శకుడు. అయితే ఆ పాయింట్ను ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం కొంత కన్యూజన్కు లోనయ్యారు. కథకు కీలకమైన ప్రధానాంశం చిన్నది కావడం…దానిని గురించి చెప్పడానికి అల్లుకున్న సంఘర్షణలో బలం లేకపోవడంతో నిరాసక్తంగా సాగుతుంది. లక్ష్యసాధనలో కథానాయికకు ఎదురయ్యే అవరోధాలన్నీ సినిమాటిక్గా ఉంటాయి వాటిలో ఆసక్తి లోపించింది. ఆ అంశాలపై దర్శకుడు దృష్టిపెడితే బాగుండేది. పతాక ఘట్టాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కాదంబరి ఎపిసోడ్ అలరిస్తుంది. సెట్స్పై ఆధారపడకుండా రియల్ లోకేషన్స్లో సినిమాను తెరకెక్కించడం సహజత్వాన్ని తీసుకొచ్చింది.
సంధ్యారాజు నటన ఎలా ఉందంటే..
సితార పాత్రలో సంధ్యారాజు అభినయం బాగుంది. స్వతహాగా డ్యాన్సర్ కావడంతో కళ్లు, ముఖకవలికలతో ఆకట్టుకున్నది. అదిత్యమీనన్, కమల్కామరాజు, శుభలేఖ సుధాకర్ తమ పరిధుల మేరకు పాత్రలకు న్యాయం చేశారు. సంప్రదాయ, ఫోక్, వెస్ట్రన్ శైలిలను మేళవిస్తూ శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం బాగుంది.
లవ్స్టోరీ, థ్రిల్లర్ సినిమాలకు అలవాటుపడిపోయిన తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రమిది. కమర్షియల్ అంశాలు, మార్కెట్ లెక్కల గురించి ఆలోచించకుండా నాట్యకళ విశిష్టతను గురించి చెప్పాలనే చిత్రబృందం తపన అభినందనీయం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ananya Panday | అనన్యపాండేకు ఎన్సీబీ సమన్లు..ఆర్యన్ కేసుతో లింక్..?
Prithviraj Sukumaran | ప్రభాస్తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత