నమస్తే తెలంగాణ నెట్వర్క్: కరోనా సమయంలో నూ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా యాసంగిలో రైతులు పండించిన ధాన్యం చివరిగింజ వరకు కొనుగోలు చేసేందుకు తపిస్తున్నది. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్ల కోసం కోట్ల రూపాయలను వ్యయం చేసి మౌలిక వసతులతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దాదాపు 20 రోజులుగా ధాన్యం కొనుగోళ్లను శరవేగంగా జరుపుతూనే ఉన్నది. ఆ వివరాలను ఆన్లైన్ చేయడంతోపాటు రైతులకు ఆన్లైన్ ద్వారానే చెల్లింపులను సైతం జరుపుతున్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,300 కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1,02,820 మంది రైతుల నుంచి రూ.1475.1 కోట్ల్లు విలువైన 7.93 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. 46,405 మంది రైతుల ఖాతాల్లో రూ.623.98 కోట్లు జమచేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 442 కేంద్రాల ద్వారా 1,74,263 టన్నుల వడ్లు సేకరించగా, రూ.95.04 కోట్లు రైతులకు చెల్లించారు. నిజామాబాద్ జిల్లాలో 63 వేల మంది రైతుల నుంచి రూ.వేయి కోట్ల విలువ చేసే 5.40 లక్షల టన్నులు, కామారెడ్డి జిల్లాలో 55,361 మంది రైతుల నుంచి రూ.520 కోట్ల విలువ గల 2.76 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. నిజామాబాద్ జిల్లాలో రూ.500 కోట్లు, కామారెడ్డిలో రూ.360 కోట్లు చెల్లించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సోమవారం ఉదయంవరకు 877 కేంద్రాల ద్వారా 68,627 మంది రైతుల వద్ద నుంచి రూ.619.5 కోట్ల విలువైన 3,28,842 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2,87,186 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 32,073 మంది రైతుల ఖాతాల్లో రూ.163.45 కోట్లు జమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 97 కేంద్రాల ద్వారా 2,749 మంది రైతుల నుంచి రూ.50 కోట్ల విలువైన 26,922 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రూ. 32.63 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశారు. ఖమ్మం జిల్లాలో 300 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.13 లక్షల టన్నుల ధాన్యం కొన్నారు. 8,951 మంది రైతులకు రూ.157 కోట్లు చెల్లించారు. నల్లగొండ జిల్లాలో 376 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.వెయ్యి కోట్ల విలువైన 5.50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, అందులో రూ.500 కోట్ల్ల చెల్లింపులు పూర్తి చేశారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 339 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 50,714 మంది రైతుల నుంచి రూ.743 కోట్ల విలువ చేసే 3,93,472 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 29,639 మంది రైతులకు రూ.492 కోట్లు ఖాతాల్లో జమచేశారు.