ఆత్మగౌరవం ఉంటే రాజీనామా చెయ్: ఎన్ఎస్యూఐ మాజీ నేత సంపత్
హుజూరాబాద్, మే 17: ఆత్మగౌరవం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయాలని ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు తిప్పారపు సంపత్ డిమాండ్ చేశారు. సోమవారం హుజూరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల హైదరాబాద్లో అక్రమంగా సంపాదించిన భూమిని ఇండస్ట్రియల్ ల్యాండ్గా మార్చడం తప్పుకాదా? అని ప్రశ్నించారు. దళితులకు ప్రభుత్వమిచ్చిన భూమిని ఎమ్మార్వోకు తిరిగి ఇవ్వాలనడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. దేవుడి భూములు, అసైన్డ్ భూములు కొన్నామని బహిరంగంగా చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ‘ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకొని ఆర్ఎస్యూ వరకు అందరితో సఖ్యతగా ఉన్నాను’ అని అన్నప్పుడే సిద్ధాంతాలు లేవని తేలిపోయిందని విమర్శించారు. వామపక్షజాలం, ఉద్యమకారుడినని చెప్పుకొనే ఈటల.. బూర్జువా పార్టీ నేతలయిన కిషన్రెడ్డి, అర్విం ద్, బండి సంజయ్ను కలిసినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? విద్యార్థి, మావోయిస్టు ఉద్యమాల్లో పనిచేసిన అని చెప్పుకున్న ఈటల ఎమ్మార్పీఎస్ను, ముదిరాజ్ సంఘాలను రెండుగా చీల్చింది నిజం కాదా? కాంగ్రెస్ బీఫాంపై గెలిచిన విజయ్కుమార్కు హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవిని కట్టబెట్టినప్పుడు ఆత్మవంచన, నయవంచన గుర్తుకు రాలేదా? అని ప్రశ్నలు గుప్పించారు. ‘ఆత్మ గౌరవం, న్యాయం, ధర్మం, సిద్ధాంతం వంటి మాటలతో కొన్నేండ్లుగా ప్రజలను మోసంచేస్తున్న ఈటల, అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో గుర్తుపెట్టుకోవాలని హితవుపలికారు. ఈటలకు నిజంగా బుద్ధి, జ్ఞానం ఉంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్చేశారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీడీ రవితేజ, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చల్లూరు రాహుల్ పాల్గొన్నారు.