అర్ధవార్షిక మహాజనసభలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి
ఖలీల్వాడి, మార్చి 31: రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. ఎన్డీసీసీబీ మహాజన సభను నిజామాబాద్లోని బ్యాంక్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. బ్యాంక్ సీఈవో గజానంద్ మహాజన సభ నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్కు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లతో వచ్చే కమీషన్తోనే జిల్లాలోని పీఏసీఎస్లు తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయని తెలిపారు. అసైన్డ్ భూములను సాగుచేసుకుంటున్న రైతులకు రుణ సదుపాయం కల్పించాలన్నారు. రుణాల రికవరీ బృందానికి పీఏసీఎస్ చైర్మన్లు సహకరించాలని తెలిపారు.
సహకార సంఘాల అధ్యక్షులకు కూడా ప్రోటోకాల్ అమలు చేయాలని, ఈ విషయంలో మంత్రి నిరంజన్రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశామని, మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. సొసైటీలను మల్టీపర్పస్ కేంద్రాలుగా మార్చడానికి నాబార్డు రుణ సహాయం చేసిందని చెప్పారు. సొసైటీలకు సరఫరా అవుతున్న గోనె సంచులు చాలా వరకు ఉపయోగం లేకుండా ఉంటున్నాయని, వాటికి డబ్బులు సొసైటీలకు వచ్చే కమీషన్ నుంచి తగ్గించి ఇస్తున్నారని చైర్మన్లు సభ దృష్టికి తీసుకురాగా.. ఇరుజిల్లాల కలెక్టర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పోచారం భాస్కర్రెడ్డి తెలిపారు. ఈ సీజన్లో కావాల్సిన గోనె సంచులను సమకూరుస్తామని చెప్పారు. సభలో మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు రమేశ్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, వైస్చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డీసీవో సింహాచలం, పాలకవర్గ సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.