చిన్నహీరోనే కాని మనసు మాత్రం చాలా పెద్దది. ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేస్తూ ఔదార్యం చాటుకుంటూ వస్తున్నారు సంపూర్ణేష్ బాబు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సీసీసీకి, అలాగే వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కి, రీసెంట్గా సినీ జర్నలిస్టు టీఎన్ఆర్ అకాల మరణంతో వారి కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన సంపూర్ణేష్ బాబు.. తాజాగా తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లలకు సాయం చేసి మంచి మనసున్న హీరో అనిపించుకున్నారు.
దుబ్బాక పురపాలక పరిధిలో ఉంటున్న నరసింహచారి దంపతులు అప్పుల భారం మోయలేక ఆత్మహత్య చేసుకున్నారు.దీంతో ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. ఈ విషయం తెలుసుకున్న సంపూర్ణేష్ వారికి 25 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించారు. ప్రతి మనిషికి జీవితంలో కష్టం, ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయని, వాటికి ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యకు పాల్పడి కుటుంబాన్ని రోడ్డున పడకుండ చూడాలని సంపూ అన్నారు.
సంపూర్ణేష్ బాబు తన ఫేస్ బుక్ పోస్ట్లో .. ”దుబ్బాకలో నరసింహచారి గారి కుటుంబంలో జరిగిన ఈ వార్త చూసి గుండె తరుక్కుపోయింది. కరోనా కష్టకాలంలో ఎంతో మంది పనులు కోల్పోయి వీధిన పడుతున్నారు. తల్లితండ్రులు కోల్పోయిన ఆ పిల్లలకు Rs.25000/- నేను మరియు మా హృదయకాలేయం, కొబ్బరిమట్ట నిర్మాత Sai Rajesh అందిచడం జరిగింది. ఎంత వరకు చదువుకుంటే అంత పూర్తి ఖర్చులు మేము చూసుకుంటాం అని వారికి మాట ఇవ్వటం జరిగింది. ఈ కష్టకాలంలో తోటి వ్యక్తులకు మన వంతు సహాయం అందిచడం మన కర్తవ్యం” అని పేర్కొన్నారు.